చిన్నప్పుడు ‘శ్రీరామదాసు’ సినిమా పాటలే పాఠాలుగా గొంతు సవరించింది. కుంచె పట్టినా, డ్యాన్స్ చేసినా.. పాటల ప్రయాణంతోనే కెరీర్ మొదలుపెట్టింది. తాజాగా, ‘ఆహా’ ఓటీటీలో ‘తెలుగు ఇండియన్ ఐడల్-2’ వేదిక మీద సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నది సిద్దిపేట సింగర్.. గుమ్మన్నగారి లాస్యప్రియ. ఆ పాటలపిట్ట మాట కచేరీ..
మాది సిద్దిపేట. సెవెన్త్ వరకు అక్కడే చదువుకున్నా. నాన్న గవర్నమెంట్ టీచర్. తరచూ బదిలీలు అయ్యేవి. దీంతో నాలుగైదు స్కూల్స్ మారాల్సి వచ్చింది. టెన్త్ తర్వాత హైదరాబాద్ కదల్లేదు. డ్యాన్స్ చేసినా, కుంచెపట్టినా.. పాటలంటేనే ఇష్టం. ‘శ్రీరామదాసు’ సినిమా వచ్చిన కొత్తలో ఇంట్లో రోజంతా ఆ పాటలే వినిపించేవి. అలా నాకు కంఠస్థం వచ్చేశాయి. పాడుతుంటే ఏదో లోకంలో తేలుతున్నట్టు అనిపించేది. ఎనిమిదో తరగతిలో.. జెమినీ టీవీ ‘బోల్ బేబీ బోల్’కి ఎంపికైనా. రన్నరప్గా కూడా నిలిచినా. ఇప్పుడు ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్కి సెలక్ట్ కావడం ఆనందంగా ఉంది.
ఫస్ట్ పెర్ఫార్మెన్స్ హీరో బాలకృష్ణ ముందు ఇచ్చాను. స్టేజ్ మీద బాలయ్యను చూడగానే భయమేసింది. కొన్ని సెకన్లలోనే ఆయన మా భయాన్నంతా పోగొట్టారు. చూడ్డానికి గంభీరంగా ఉంటారు కానీ.. చాలా నవ్విస్తారు. మా అమ్మమ్మ చేసిన భక్ష్యం ఆమె చేత్తోనే రుచి చూసి.. ‘బాగుంది అమ్మా’ అని మెచ్చుకున్నారు. పోటీలో మొత్తం 12 మంది ఉన్నాం. జడ్జి సీట్లో గీతా మాధురి గారు, తమన్ గారు ఎన్విరాన్మెంట్ని చాలా కూల్గా మార్చేస్తారు. అన్నట్టు మాకు ఒక లైవ్ బ్యాండ్ కూడా ఉంది. దానిపేరు ‘అనహత మ్యూజిక్ బ్యాండ్’. రెగ్యులర్గా బ్యాండ్లో పాడటం వల్లే స్టేజ్ ఫియర్ లేకుండాపోయింది. ఇప్పటికైతే ఇంతే ముచ్చట్లు. టైటిల్ కొట్టాలని ఆశీర్వదించండి. హ్యాపీ ఉగాది.