తెలుగు ఓటీటీ వేదిక.. ‘ఆహా’ మహిళల కోసం సరికొత్త రియాలిటీ షోను తెరమీదికి తీసుకురానుంది. ‘నేను సూపర్ ఉమెన్’ పేరిట ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళా ఆంత్రప్రెన్యూర్లు తమ వ్యాపార ఆలోచనలను పంచుకుంటారు.
వ్యాపార వృద్ధికి సంబంధించి స్టార్టప్స్కు సలహాలిచ్చేందుకు ‘ఏంజెల్స్’గా పిలిచే మెంటర్ల బృందం సిద్ధంగా ఉంటుంది. డార్విన్ బాక్స్ కో ఫౌండర్ రోహిత్ చెన్నమనేని, ముద్ర వెంచర్స్ స్థాపకురాలు స్వాతి రెడ్డి గునుపాటి, సిల్వర్ నీడిల్స్ వెంచర్స్కు చెందిన రేణుక బొడ్ల, క్వాంటెల్ ఇంక్ వ్యవస్థాపకులు శ్రీధర్ గది తదితరులు మెంటర్స్గా వ్యవహరిస్తారు.
కార్యక్రమంలో ఆలోచనలు పంచుకున్న వాళ్లు వ్యాపారాభివృద్ధి సూచనలతో పాటు పెట్టుబడులనూ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది ఆహా. బిజినెస్ ఐడియా లేదా ప్రస్తుత వ్యాపార వివరాలతో ఫిబ్రవరి 5లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ వీహబ్ కూడా ఇందులో భాగస్వామి. వివరాలకు.. bit.ly/nenusuperwoman చూడండి.