మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ వరం సొంతూరు. వ్యవసాయ కుటుంబం. నాలుగేండ్ల వయసునుంచే పాటతో సోపతి చేసింది. కళా వారసత్వం కాకపోయినా, ప్రాంత ప్రభావం లేకపోయినా చిన్నప్పటి కోరికతో గాయని కావాలని కలగన్నది. ఆ కలను సాకారం చేసుకొని సినిమాలకు పాడే స్థాయికి ఎదిగి, జానపదాల చెంతకు చేరిన వరం పాటల ప్రస్థానం.
ఆమె హాకీ ప్లేయర్. సాదాసీదాగా కాదు. నేషనల్స్కు ఎంపికైన క్రీడాకారిణి. అలానే ఆడితే, భారత హాకీజట్టులో మంచి పొజిషన్ వచ్చేది. కానీ, పాటకోసం ఆట వదులుకున్నది. హాకీబ్యాట్ పట్టిన చేత్తోనే గ్రామ్ఫోన్తో అలరిస్తున్నది. సినిమా పాటలతో మొదలై, జానపద జాతరలో జోరు మీదున్నది.అరుదైన గొంతుతో, అద్భుతమైన పాటల కోటలు కడుతున్న ఆ గాయని..వరం వరిపల్లి.
నా పూర్తి పేరు వరలక్ష్మి. అందరూ ‘వరం’ అంటారు. చిన్నప్పటి నుంచే నాన్న పద్యాలు చెప్తుండేవారు. నాతో పాడించేవారు. పాట పాడాలనే ఆసక్తి ఏర్పడటానికి నాన్న పాడించిన పద్యాలూ కారణమే. నాన్న పేరు ఉప్పలయ్య, అమ్మ కనకలక్ష్మి, అన్న సారయ్య. నేను అయిదో తరగతిలో ఉన్నప్పుడు సైన్స్ వేణుసార్ ఒకరోజు క్లాస్కి వాక్మన్ తెచ్చారు. ‘సూర్యవంశం’ సినిమాలోని ‘రోజావే చిన్ని రోజావే’ పాట వినిపించి నాచేత పాడించారు. అప్పటికే నేను స్కూల్లో పాడేదాన్ని. నేను పాడిన పాటను రికార్డ్ చేసి వినిపించారు. వింటుంటే కొత్త అనుభూతి కలిగింది. ‘ఇంత చిన్న పరికరంలో పాడిందే ఇంత అద్భుతంగా వస్తే, సినిమాలకు పాడితే ఇంకెలా ఉంటుంది?’ అనే ఆలోచనే నాతో పాటలు పాడించింది.
బేరువాడలో సెవెన్త్ క్లాస్ వరకు చదివాను. హెడ్మాస్టర్ శ్రీనివాస్గారు ‘అమ్మాయిలు అన్నిట్లో రాణించాలి’ అని ప్రోత్సహించేవారు. చారిసార్, వేణుసార్, గురుదేవ్ సార్.. వీళ్లందరి సహకారంతో స్కూల్లోనే కాకుండా బయట ప్రోగ్రామ్స్లో పాల్గొనేదాన్ని. పదో తరగతికి కేసముద్రం వెళ్లాను. అక్కడ భద్రాద్రి సార్ సహకారంతో కొత్త కొత్త పాటలు నేర్చుకున్నా. పాటలతో సాగుతున్న నా ప్రయాణాన్ని సంపత్కుమార్ సార్ హాకీ వైపు మళ్లించారు. ఇంటర్కు వచ్చేనాటికి ‘హాకీ నేషనల్స్’కి సెలక్ట్ అయ్యాను. కానీ పాటలపై ఆసక్తితో హాకీ అక్కడితోనే ఆపేశాను. ఇంటర్ ఫస్టియర్లో పబ్బతి సుధాకర్ ‘మార్మోగిన పాట’లో పాడేందుకు హైదరాబాద్ తీసుకొచ్చారు. జానపదం పాడిస్తారని అనుకున్నా కానీ ‘ఏ చోట నువ్వున్నా’ అనే సినిమా పాటనే పాడించారు. మంచి స్పందన వచ్చింది.
30 దాకా సినిమాలకు: అది 2012. నా పాటలను ఎప్పటినుంచో అబ్జర్వ్ చేస్తున్న స్వామి, మిర్యాల సురేశ్ ‘ఆల్బమ్ చేస్తే బాగుంటుంది కదా’ అన్నారు. హైదరాబాద్ వచ్చి ఆల్బమ్ చేశాం. ఆ పాట ‘మనసా మనసా’, మ్యూజిక్ డైరెక్టర్ ఎలెందర్గారు. తొలిసారిగా నా గొంతు నేను వింటూ తన్మయత్వం చెందాను. నేను ‘మార్మోగిన పాట’లో పాడినప్పుడు ‘వాయిస్ సినిమాటిక్గా ఉంది’ అని బోలేగారు అనుకున్నారట. డిగ్రీకోసం హైదరాబాద్ వచ్చాను. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ చేశాను. ఆ సమయంలో సింగర్ హేమచంద్ర వాళ్ల అమ్మ శశికళగారి దగ్గర సంగీతం నేర్చుకున్నా. అప్పుడే బోలేగారు ‘హమ్ తుమ్’ సినిమాకు అవకాశం ఇచ్చారు. తర్వాత ఆర్ఎక్స్100, ఇస్మార్ట్ శంకర్, సీటీమార్, ధనలక్ష్మి తలుపు తడితే, బంతిపూల జానకి, సాగరతీరంలో.. వంటి 30 సినిమాల్లో అవకాశం వచ్చింది. సినిమాల్లో మంచి పేరు వచ్చిన తర్వాత జానపదాలకు ఎంట్రీ ఇచ్చాను.
పాటతో పాటు ఆట: ‘సినిమాల తర్వాత మళ్లీ జాన పదాలవైపు ఎందుకు?’ అని చాలామంది అన్నారు. నేను బేసిగ్గా సింగర్ని. ఏ పాటైనా పాడగలిగినప్పుడే వృత్తికి న్యాయం చేసినట్టు. చిన్నప్పుడు జానపదాలు పాడే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది. జానపదాలు అంటేనే ప్రజల పాటలు. అవి పాడినా, విన్నా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి, జానపదాలను ఆప్షన్గా ఎంచుకున్నా. తెలంగాణలో జానపదాలకు కొదువలేదు. వాటి విలువ తెలిసే సినిమాల్లో కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి, జానపదంతో కూడా నా జర్నీని కొనసాగిస్తూనే ఉంటాను. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో ట్రాక్ పాడే అవకాశం రావడం అదృష్టం. ఇంకోటి, మణిశర్మగారి సినిమాలో పాడాలనే నా కలా నెరవేరింది. నా స్వరమే ఒక వరంలా భావిస్తాను. భవిష్యత్లో నా పాటలకు నేనే మ్యూజిక్ చేసుకొని, నేనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నా. హాకీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సీనియర్ నేషనల్స్కు సెలక్ట్ అయ్యేందుకు ప్రాక్టీస్ చేస్తున్నా. అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. నా కష్టం ఫలించి, కల సాకారం అవుతుందనే నమ్మకం ఉంది. విజయాన్ని, అపజయాన్ని ఒకేలా స్వీకరించడం నా స్వభావం.
జానపదాల్లో అవకాశం
బోలేగారితో జర్నీ స్టార్ట్ అయి చాలా పాటలు పాడుతున్న క్రమంలో కందికొండగారు పరిచయమయ్యారు. 2016లో ఒకసారి స్టూడియోలో కలిశాను. ‘ఈ పాట ఉన్నది పాడమ్మా’ అని బోలేసార్ అన్నారు. ట్రాక్ తీసుకొని పాడాను. మూడు, నాలుగు మాడ్యులేషన్స్ తీసుకొని పాడితే అందరూ ఆశ్చర్యపోయారు. అసలు పాడింది నలుగురా? అని అడిగారంట. అలా, నా తొలి ఫోక్ బేస్డ్ ఫెస్టివల్ సాంగ్ హిట్టయింది. తర్వాత అవకాశాలు చాలా వచ్చాయి.
అమ్మ నేర్పిన ధైర్యం
పాటలవల్లే నాకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది. మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఆస్ట్రేలియా, అబుదాబీ వంటి దేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చాను. బేరువాడ నుంచి మెల్లగా అడుగులు వేస్తూ హైదరాబాద్ వచ్చాను. అక్కడినుంచి వేరే ఖండాలకు వెళ్తానని మాత్రం అనుకోలేదు. నాన్న ఉన్నప్పుడు రెండు మూడు సినిమాలకు పాడాను. చాలా మెచ్చుకున్నారు. ‘నా కల నెరవేర్చావు బిడ్డా’ అనేవారు. అమ్మ మాకోసం ఎన్నో కష్టాలు పడింది. ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొనే ధైర్యం, ఆత్మ స్థయిర్యం అమ్మను చూసే నేర్చుకున్నా. అన్న ప్రోత్సాహం మరవలేనిది.
రైతుల పాటలు, సామాజికాంశాల పాటలు పాడుతూ వస్తున్నాను. బావా-మరదళ్ల పాటలు, ప్రేమపాటలుకూడా పాడాను. గోరెటి వెంకన్న రాసిన తొలి పండుగ పాట ‘బొట్టూ బోనం’ పాడింది నేనే. ఇప్పటి వరకు 200కు పైగా జానపదాలు పాడాను. ‘బతుకమ్మ ఫిల్మోత్సవ్’లో అవార్డుకూడా ఇచ్చారు.
దాయి శ్రీశైలం