పిల్లలు పుట్టగానే కెరీర్ చచ్చిపోతుందని చాలామంది మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ మాట ఎంతోకొంత నిజం కూడా. కానీ, బిడ్డకు జన్మనివ్వడమే కాదు, వెనువెంటనే కెరీర్కు పునర్జన్మనిచ్చే అమ్మలూ ఉన్నారు. ప్రసూతి సెలవులో సివిల్స్కు సిద్ధమై.. ఐపీఎస్కు ఎంపికైన షెహనాజ్ ఇల్యాస్ కథ అలాంటిదే.
చదువు ముగిసిన తర్వాత షెహనాజ్ ఓ ఐటీ కంపెనీలో చేరింది. ఐదేండ్లు ఆ రంగంలోనే పని
చేసింది. జీతం బాగానే ఉన్నా, ఆ కొలువు పెద్దగా తృప్తినివ్వలేదు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న తపన ఆమెది. అంతలోనే పెండ్లయింది. గర్భిణిగా ఉన్న సమయంలో సివిల్ సర్వీసులలో చేరాలని బలంగా నిర్ణయించుకుంది. తొమ్మిది నెలల గర్భంతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించింది. అదీ తొలి ప్రయత్నంలో, కేవలం రెండు నెలల ప్రిపరేషన్తోనే. ఆ అనుభవంతో యూపీఎస్సీ సివిల్స్ కూడా రాయగలను, విజయం సాధించగలను అన్న విశ్వాసానికి పునాదిపడింది. అయితే, ఓ వైపు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూనే రోజుకు 10 గంటలు చదవడం ఏ తల్లికైనా సవాలే. కుటుంబ సభ్యుల సహకారంతో ఆ అవరోధాన్ని అధిగమించింది. కఠోర శ్రమతో 2020 సివిల్ సర్వీస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 217వ ర్యాంకు సాధించింది. ఐపీఎస్ అధికారిగా ఎంపికైంది. ‘సివిల్స్ కోసం నేను నెల మొత్తానికీ ప్రణాళిక వేసుకునేదాన్ని. దానిని తు.చ. తప్పకుండా ఆచరణలో పెట్టేదాన్ని’ అంటారు తమిళనాడుకు చెందిన షెహనాజ్.