ఎవరైనా బ్యాంకులో పదో పరకో దాచుకుంటారు. లాకర్లో నగో నట్రో పెట్టుకుంటారు. కానీ, తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మట్టిగోడలతో కట్టిన ఓ బ్యాంకులో మాత్రం ఈత బుట్టల్లో విత్తనాలను భద్రపరుస్తారు. రేపటి తరాలకు స్వచ్ఛమైన ఆహారాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తునూ అందించే లక్ష్యంతో ఈ ‘సీడ్ బ్యాంక్’ను పల్లె మహిళలే నిర్వహిస్తున్నారు.
సేద్యం అంటేనే అతివృష్టి, అనావృష్టి. పంటలు దెబ్బ తింటే, విత్తనాల కొరత ఏర్పడుతుంది. దానికి తోడు నకిలీల సమస్యలూ ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో పంటల సాగు ఆగకుండా, ఆహార కొరత లేకుండా ముందు జాగ్రత్తగా విత్తనాలను భద్రపరుస్తారు ఆ పల్లెలో.
ఇలా సేకరిస్తారు..
వ్యవసాయం తప్ప ఇంకో ఉపాధి తెలియని ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కరువు నేలే. ఏటా అతితక్కువ వర్షపాతం నమోదవుతుంది. అందుకే, అక్కడ నీటి వనరులు అవసరమయ్యే వరి, చెరకు లాంటి పంటలు పండించడం కష్టం. చిరుధాన్యాలు, పప్పుదినుసులే సాగు చేస్తారు. పాతకాలపు పంటగింజలను భద్రపరచడం ఈ పల్లె తరతరాల సంప్రదాయం. వాటినే రైతులు తిరిగి పండిస్తున్నారు. దానికి కొనసాగింపే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూరులోని ‘సీడ్ బ్యాంక్’.
మహిళా రైతులు లక్ష్మమ్మ, నర్సమ్మ ఈ బ్యాంక్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. విత్తనాలను డిపాజిట్ చేసుకోవడం, అవసరమైన వారికి సరఫరా చేయడం వీరి బాధ్యతలు. బ్యాంకు ఉద్యోగమంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. వీళ్లూ అంతే. విత్తనాల సేకరణలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రైతుల పొలాల దగ్గరకు వెళ్లి, సాగు విధానాలను పరిశీలించి, నాణ్యమైన విత్తనాలను మాత్రమే డిపాజిట్ చేసుకొంటారు.
ప్రతి బ్యాంకు పరిధిలో ఎన్నో కొన్ని గ్రామాలుంటాయి. సీడ్ బ్యాంకు కూడా దాదాపు 75 గ్రామాల మహిళా రైతులతో విత్తన ఒప్పందాలు చేసుకుంటుంది. అందరూ ఇక్కడే విత్తనాలను డిపాజిట్ చేస్తారు. వీళ్లంతా 15 నుంచి 20 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎక్కడా రసాయన ఎరువులు, పురుగు మందుల జోలికి వెళ్లరు. ప్రతి గ్రామంలోని రైతులతో సంఘాలను ఏర్పాటు చేయించి, ప్రకృతి సాగు, విత్తన శుద్ధిపై అవగాహన కల్పించడం కూడా బ్యాంకు బాధ్యతల్లో ఒకటి.
వారసత్వ విజ్ఞానం
మాచునూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఏమీ చదువుకోలేదు. స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. తనే కాదు, ఆ ప్రాంతంలో అందరిదీ ఇదే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికెళ్లి సేద్యం చేసుకోవడమే వారికి తెలుసు. నేల మనకిచ్చిన వివిధ రకాల వంగడాలను కాపాడుకోవడం చాలా ముఖ్యమన్న విషయం మాత్రం తాత తండ్రికి చెప్పగా విన్నది. తండ్రికూడా తనకు అదే మాట చెప్పాడు. అందుకే, పండించిన ప్రతి పంటనుంచీ కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. తన నేలలో పండిన పంటనుంచి తీసినవి కాబట్టి, అక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. ఆ అవగాహనను గుర్తించిన ‘డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ’ విత్తన బ్యాంక్ నిర్వహణ బాధ్యతను ఆమెకు అప్పగించింది.
ఈతాకుల గాదెలు
బ్యాంకులో డబ్బు సంరక్షణకు లాకర్లు ఉంటాయి. సాయుధులైన గార్డులు ఉంటారు. కెమెరాలు పహరా కాస్తుంటాయి. ఇక్కడకూడా విత్తనాల భద్రతకు తగిన సంప్రదాయ వ్యవస్థ ఉంది. ‘విత్తనాలు చెడి పోకుండా ఉండేందుకు మూడంచెలుగా భద్రపరుస్తాం. ఇరవై ఏండ్ల క్రితం మాచునూరు అటవీ ప్రాంతంలో ప్రారంభమైన ఈ విత్తన బ్యాంకుద్వారా ఇప్పటివరకూ వందలాది ఎకరాలకు విత్తనాలు అందించాం. ఈతాకులు, నారతో పెద్ద బుట్టలు తయారు చేసి, వాటి అడుగున వేపాకు, బూడిద వేసి, పైన విత్తనాలు వేస్తాం. మూడంగుళాల మందంలో మూడు పొరలుగా మరోసారి బూడిద, వేపాకు వేసి విత్తనాలు భద్రపరచి, పైన మూత పెట్టి పశువు పేడ, ఎర్రమన్నుతో అలుకుతాం. రెండేండ్ల వరకు విత్తనాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. నల్ల, ఎర్ర వడ్ల విత్తనాలపై జామాయిల్ ఆకులు వేసి నిలువ చేస్తాం. 70 రకాల విత్తనాలు మా బ్యాంకులో ఉన్నాయి’ అంటున్నది లక్ష్మమ్మ. జొన్నలో నాలుగు రకాలు; మినుము, నువ్వులు, సజ్జల్లో మూడు రకాలు; బొబ్బర్లలో మూడు రకాల విత్తనాలు బ్యాంకులో ఉన్నాయి. మొత్తం నిల్వలు 20 క్వింటాళ్ల వరకూ ఉండవచ్చు. ‘ఇలా విత్తనాలు జాగ్రత్త పరచడం పూర్వికుల నుండి వస్తున్న సంప్రదాయమే. మా నేలలో మా విత్తనాలే పండిస్తాం. బయటినుండి ఒక్క గింజకూడా తెచ్చుకోం. మా దగ్గర తీసుకున్న విత్తనాలు నాటేముందు, పశుమూత్రంతో శుద్ధి చేయాలి’ అంటారు బ్యాంకు నిర్వహణలో పాలు పంచుకొనే చంద్రమ్మ.
మార్పు మొదలైంది…
ఝరాసంగం మండలంలోని 72 గ్రామాల్లో పాత పంటలు సాగు చేస్తున్నారు. ‘మా విత్తనాలు కొనండి. అధిక దిగుబడిని సాధించండి’ అని ఊదరగొట్టే విత్తన కంపెనీల ఆటలేవీ ఈ పల్లెల్లో సాగవు. క్రిమి సంహారక మందుల ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. పాత విత్తనాలను పరిరక్షించి, బహుళజాతి కంపెనీలకు ప్రవేశం లేకుండా చేయగలగడమే వీరు సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతులను నిలువునా ముంచుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తు తరాలకోసం ఆరోగ్యకరమైన విత్తనాలను ఈ బ్యాంకులో భద్రపరుస్తున్నారు. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి గుణాన్ని కాపాడుకోవాలనేది స్థానిక మహిళల లక్ష్యం. విత్తన బ్యాంకును అధ్యయనం చేయడానికి నిపుణులూ వస్తుంటారు. వీరి అంకితభావాన్ని ప్రశంసిస్తుంటారు. ఈ రోజు గడిస్తే చాలని అనుకోకుండా, రాబోయే ఉపద్రవాలనూ దృష్టిలో పెట్టుకుని విత్తన బ్యాంకును నిర్వహిస్తున్న ఈ మహిళల ప్రయత్నాన్నిఅభినందించాల్సిందే!
విత్తన నాణ్యత
“విత్తన నాణ్యతపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన విత్తనం అంటే మొలకల శాతం అధికంగా ఉండి, మొలకెత్తే శక్తిని పుష్కలంగా కలిగిన గింజ. ఇలాంటి వాటివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. విత్తనోత్పత్తి పంటల విషయంలో కోత తర్వాత విత్తనాన్ని నూర్చి, తగిన తేమ శాతం వచ్చేవరకు ఎండబెట్టి, తర్వాత విత్తనశుద్ధి చేసి నిలువ చేసుకోవాలి” అంటారు సీడ్ బ్యాంకు మహిళలు.
… శ్యాంమోహన్