Ramani Mailavarapu | మోడలింగ్ చేస్తారు. బొమ్మలు గీస్తారు. ఫొటోలు తీస్తారు. నృత్యం చేస్తారు. పాఠాలు చెబుతారు. ఏకాంకికలు ప్రదర్శిస్తారు. ప్రతి ప్రయత్నంలోనూ సామాజిక స్పృహ ఉండి తీరుతుంది. రైతుల పట్ల ప్రేమ, మహిళల సమస్యల పట్ల సానుభూతి తొంగి చూస్తుంది. మైలవరపు రమణి దృష్టిలో ఐదుపదుల వయసు ఓ అంకె మాత్రమే. తనవే అయిన ప్రత్యేకతలతో తనదైన ప్రపంచంలో బతికేస్తున్న రమణి రాజీలేని ప్రయాణం ఆమె మాటల్లోనే..
‘కాకినాడ మా సొంతూరు. అక్కడే బీఎస్సీ వరకు చదువుకున్నా. వెంటనే పెండ్లి. హైదరాబాద్కు ప్రయాణం. నాన్న విశ్రాంత ఇంజినీర్. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచీ నాకు మట్టి మీద మమకారం. పొలాలంటే పంచప్రాణాలు. ఎప్పుడు సెలవు దొరికినా పొలానికెళ్లి పనిచేస్తా. కూలీలతో మాట్లాడతా. వాళ్ల పరిస్థితులు తెలుసుకుంటా. పచ్చని పంటల మధ్య, పక్షుల కిలకిలరావాలు వింటూ ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అదృష్టం ఉండాలి. మా వారు సివిల్ సర్వెంట్. ఆదాయ పన్ను శాఖలో చేస్తున్నారు. ఆడవాళ్లకు ఆర్థిక సాధికారత ఎంతో అవసరం. అందుకు ఏకైక మార్గం చదువు. అందుకే, పెండ్లయిన తర్వాత మళ్లీ చదువు కొనసాగించాను.
హైదరాబాద్ రాకముందు బెంగళూరులో ఉన్నాం. అక్కడ బొటిక్ నిర్వహించాను. పాపకు నాలుగేండ్లు రావడంతో తన చదువుకోసం వ్యాపారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పాప బడికి వెళ్లాక కొంత తీరిక దొరికేది. ఆ సమయంలో స్నేహితురాలితో కలిసి పెయింటింగ్ నేర్చుకున్నా. దొడ్డ మణి అనే గురువు దగ్గర ఏడాదిపాటు మెలకువలు తెలుసుకున్నా. కొన్నాళ్లకు మావారికి మళ్లీ హైదరాబాద్ బదిలీ అయ్యింది. పదేండ్ల నుంచీ ఇక్కడే ఉంటున్నాం.
బెంగళూరులో నేర్చుకున్న చిత్రకళను అటకెక్కించకుండా ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్లో ప్రావీణ్యం సాధించా. నా స్నేహితురాలి సలహా మేరకు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఎంట్రెన్స్ రాశాను. ఏడో ర్యాంకు వచ్చింది. అక్కడే ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేసి టాపర్గా నిలిచాను. అప్పటికి పాప ఇంటర్కు వచ్చింది. నేనేమో నలభై ఏండ్ల ఆర్ట్స్ విద్యార్థిని! నేను నిర్వహించిన ఓ ప్రదర్శన ‘బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్’, ‘బెస్ట్ కొరియోగ్రాఫర్’ అవార్డులను తెచ్చిపెట్టింది. కాంటెంపరరీ ఆర్ట్ కోర్స్ చేయడానికి లండన్ కూడా వెళ్లాను.
వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. ఆ బక్కజీవి ఎంతకాలమని నష్టాల బరువులు మోస్తాడు? ఏదో ఒకరోజు కాడి దించేస్తాడు. అదే జరిగితే, ఆకలిచావులు తప్పవు. కాబట్టే, రైతుల కథలు, వ్యథలు కళాత్మక శైలిలో ప్రపంచానికి తెలియజేస్తుంటాను. ఓ ఎగ్జిబిషన్లో ‘వ్యవసాయమనే వైకుంఠపాళిలో రైతులకు నిచ్చెనలే లేవు. ఖర్చులనే పాములు రైతు ఉసురు తీస్తున్నాయి’ అనే కాన్సెప్ట్తో ఓ పెయింటింగ్ ప్రదర్శించా. ఆ ఆర్ట్ ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇదే కాదు, ప్రతి సమస్యనూ సరికొత్తగా, నలుగురూ ఆలోచించేలా చూపాలన్నదే నా లక్ష్యం. దీనివల్ల చర్చ జరుగుతుంది. వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తుంది. నేను జనం మధ్య ఉండటానికే ఇష్టపడతాను. పొలాల్లో తిరిగి పల్లె పాటలను నేర్చుకున్నా. పొలంగట్ల మీద మహిళా రైతులు నడుస్తుంటే ర్యాంప్ వాక్ చేస్తున్నట్లే ఉంటుంది. ఆ అందమైన క్షణాలను వీడియోగా బంధించి డాక్యుమెంటరీ చేశాను. ‘డిజిటల్ ఎగ్జిబిషన్’ పేరిట అది వైరల్ అయ్యింది. నాకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. గ్యాలరీ-78 మాదాపూర్లో రెండుసార్లు ఫొటో ఎగ్జిబిషన్ పెట్టాను.
కళల ద్వారా మహిళా సాధికారతను ప్రచారం చేస్తున్నా. ‘స్త్రీకి బాహ్య సౌందర్యం కంటే, అంతర్గత శక్తి చాలా అవసరం’ అన్న సందేశంతో జిమ్లో తాళ్లతో కట్టేసుకున్న ఫొటోషూట్ చేశా. అత్యాచార బాధితులను సమాజం చిన్నచూపు చూస్తున్న సమయంలో, ఆ మహిళల ఒంటరి పోరాటానికి మద్దతుగా మరో ఫొటోషూట్ చేశాను. స్త్రీత్వాన్ని కించపరుస్తూ నగ్నంగా వేసిన కొన్ని యూరోపియన్ పెయింటింగ్స్ను ఆధునికీకరిస్తూ.. నేటి స్త్రీ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నదని చాటి చెప్పాను. ఒక్కో పెయింటింగ్ను రీ విజిటింగ్, రీ మోడలింగ్ చేస్తూ మహిళను ఏ పరిస్థితుల్లోనూ అగౌరవపరచవద్దనే సందేశాన్ని ఇచ్చాను. మహిళా వ్యవసాయ కూలీలకు మగవారితో సమానంగా వేతనం ఇవ్వాలన్న డిమాండ్కూ ఓ కళారూపం ఇచ్చాను. కరోనా పరిస్థితులను కండ్లకుకడుతూ.. మోనాలిసా మాస్క్ పెట్టినట్లు, దండం పెట్టినట్లు చూపాను. నేను నిత్య విద్యార్థిని. అందుకే 50 ఏండ్ల వయసులోనూ కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంటున్నా. గతి స్కూల్ విద్యార్థులకు వారానికి రెండు రోజులు డ్రాయింగ్, పెయింటింగ్పై శిక్షణ ఇస్తున్నా.
దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతన్నలకు వరంగా మారాయి. రైతుల పరిస్థితులు మెరుగయ్యాయి. ఉచిత కరెంట్తో చాలా ఇబ్బందులు తొలగాయి. ఇలాంటి పథకాలు దేశం మొత్తం అమలుచేయాలి. వ్యవసాయాన్ని బతికించాలి. వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తూనే వ్యవసాయం చేయవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఆహారం, పండ్లు, పాలలో కల్తీని నివారించాలి. తినేది తాజాగా తినాలి. మంచి వ్యవసాయంతో ఆరోగ్యంగా జీవించాలి. ఇదే నా సూత్రం. ఎప్పటికైనా రైతే రాజు!
– రమణి మైలవరపు
– డప్పు రవి
Read More :
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా
Kriti Trust | నలుగురి కోసం ఆ ఇద్దరు.. లక్షల జీతాలు వదిలి మరి..”