ప్రతి పండుగ వెనుక ఓ అర్థం, అంతరార్థం, పరమార్థం, పరమాత్మ తత్త్వం ఇమిడి ఉంటాయి . ఆనవాయితీలు, ఆచారాలు, అలవాట్లు, సంప్రదాయాల సమ్మిళిత సమన్వయ తత్త్వం దాగి ఉంటాయి. సామాజిక హితమూ, పర్యావరణ ప్రయోజనమూ మిళితమై ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నాడే బ్రహ్మ మొత్తం సృష్టి చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మత్స్యావతారంలో సోమకుడ్ని వధించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన సమయంలో.. విష్ణు దేవుడి ప్రీతి కోసం ఉగాది వచ్చిందనేది పురాణ కథనం. శాలివాహనుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడు పట్టాభిషిక్తుడైనట్టు ఐతిహ్యం. వరాహ మిహురుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమినాడే.
కాల స్వరూపం
‘అక్షయమైన కాలాన్ని నేను’ అంటాడు గీతాచార్యుడు. కాలం భగవత్ స్వరూపం. మహా భారత ఆదిపర్వంలోని ఉదంకుని చరిత్రలో.. సంవత్సర స్వరూప నిరూపణ ఉంది. గురువు ఆజ్ఞతో ఉదంకుడు ఓ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు తెలుపు నలుపు దారాలను నేస్తుంటారు. దానికి సమీపంలో ఆరుగురు.. పన్నెండు ఆకుల చక్రాన్ని తిప్పుతుంటారు. ఉదంకునికి వీరెవరో తెలియలేదు. అంతలోనే వేదాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తెలిసింది.. తెలుపు నలుపు దారాలను నేస్తున్న ఆ ఇద్దరూ విధి, విధాత అని. తెలుపు పగలు అనీ, నలుపు రాత్రి అనీ. పన్నెండు ఆకుల చక్రమే పన్నెండు నెలల కాలమనీ అర్థమైంది.
ఈ పన్నెండు ఆకుల కాలాన్ని ఆరు రుతువులు తిప్పుతున్నాయి. ఇదీ మహా భారతం వర్ణించిన సంవత్సర స్వరూప విశేషం. కాలం జీవులకు చైతన్యం కలిగిస్తుంది. అందుకే తత్వైనమః, నిమేషాయ నమః, కాలాయ నమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాం. ఉగాది నాటి పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం కూడా కాల స్వరూప నామార్చనకు ప్రతీకే. లోకాస్సమస్తా సుఖినో భవంతు.
– రమాప్రసాద్ ఆదిభట్ల