హరిత విప్లవ సాధనలో డాక్టర్ ఎంఎస్ స్వామి నాథన్… శ్వేత విప్లవ సాధనలో డాక్టర్ వర్గీస్ కురియన్ ఎంత కృషిచేశారో సిల్వర్ రెవల్యూషన్ సాధనలో అంతటి కృషి చేసిన మహ నీయుడు పద్మశ్రీ డాక్టర్ బండా వాసుదేవ రావు. ఈ విజయాల్లో మరో భాగస్వామి.. ఆయన సతీమణి ఉత్తరాదేవి. పౌల్ట్రీ రంగంలో చిన్న ఉద్యోగిగా ప్రయాణం మొదలు పెట్టిన బి.వి. రావు దేశీయ కోళ్ల పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందడానికి ఆయన ప్రతిభ, కృషితోపాటు ఉత్తరాదేవి అండ కూడా ఓ కారణమే. ‘వేంకటేశ్వర హేచరీస్’ విజయ ప్రస్థానంలో ఉత్తరాదేవి తోడ్పాటును అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తుచేసుకుందాం.
స్వతంత్ర భారతంలో తీవ్రమైన సమస్య ఆకలి. పౌష్టికాహార లోపంతో రోగగ్రస్తమైన దేశాన్ని జనాభా విస్ఫోటనం మరింత భయపెట్టింది. అభివృద్ధి చెందాలన్న భారతదేశ కలలు కల్లలవుతాయేమోనని ప్రపంచమంతా అనుకుంది. సరైన తిండి లేక ఎంతోమంది పోషకాహార లోపంతో రోగాలపాలయ్యారు. అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, చదువుకున్న వాళ్లు పల్లెల్లో తిరుగుతూ పోషకాహార లోపాన్ని అధిగమించాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్డును తినమని ప్రచారం చేశాయి. ఆ ప్రభావంతో చాలామంది ఇళ్లల్లో కోళ్లను పెంచి, గుడ్లను తినడం అలవాటు చేసుకున్నారు.
బండా వాసుదేవరావు (బి.వి. రావు) అమ్మానాన్నలు కూడా ఇదే పద్ధతిని పాటించేవాళ్లు. ఆయన పుట్టింది, పెరిగింది హైదరాబాద్లో. స్కూల్ ఫైనల్ పరీక్షలకు ముందే ఆయనకు ఉత్తరాదేవితో (24 మార్చి 1954న) పెండ్లి జరిగింది. ఆర్థిక సమస్యలతో చదువును మధ్యలోనే ఆపి, రకరకాల ఉద్యోగాలు చేశారు. కొన్నాళ్ల తర్వాత రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘డెయిరీ ఫార్మింగ్, విలేజ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్’లో చేరారు. శిక్షణ పొందిన 2 వేల మందిలో ఆయన ఆరో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం వెటర్నరీ అండ్ డెయిరీఫామ్లో ఉద్యోగంలో చేరారు. అక్కడ బర్రెలు, జెర్సీ ఆవులతోపాటు కొన్ని కోళ్ల జాతుల పెంపకం బాధ్యతలు తీసుకున్నారు. తన భవిష్యత్ ఇదేనని ఆయన అప్పుడే నిర్దేశించుకున్నారు. తర్వాత కోళ్ల పరిశ్రమలో పేరుగాంచిన ఆర్బర్ ఏకర్స్లో హేచరీ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. కంపెనీ పెద్దదే. కానీ, జీతం 400 రూపాయలు. అద్దె ఇంట్లో ఉంటూ బతకగలమా? అని బి.వి. రావు సందేహిస్తుంటే.. ‘పొదుపుగా బతుకుదాం పద’ అని భార్య ఉత్తరాదేవి ప్రోత్సహించింది. వెంటనే నివాసాన్ని హైదరాబాద్ నుంచి పుణె దగ్గర్లోని తలెగావ్కు మార్చారు. ఇంటి అద్దె 150 రూపాయలు. తక్కువ ఖర్చుతో ఇంటిని నడుపుతూ హైదరాబాద్లో చేసిన అప్పులు తీరుస్తూ వచ్చారు. అప్పులు తీరిన తర్వాత నెలనెలా కొంత మొత్తం పొదుపుచేసిందామె. . పిల్లలు అనురాధ, వెంకటేశ్వరరావు, బాలాజీల పెంపకం, చదువు బాధ్యతలు ఉత్తరాదేవి చూసుకునేది. ఇంట్లో ఎన్ని పనులున్నా సెలవు పెట్టడం బి.వి. రావుకి కుదిరేది కాదు. అయినా సరే ఆమె ఎన్నడూ భర్త సహకారం కోరలేదు. ఆ కష్టకాలంలో ఆలూమగలు అరమరికల్లేకుండా సాగిపోతున్నారు. ఇంతలో బి.వి. రావుకు ఆపరేషన్స్ మేనేజర్గా పదోన్నతి వచ్చింది. జీతం పెరిగింది. 1969లో ఆర్బర్ ఏకర్స్ కంపెనీ లాభాల్లోకి వచ్చింది. ఆ సమయంలో భారత్ వచ్చిన ఆ సంస్థ రీజినల్ మేనేజర్ బి.వి. రావు నైపుణ్యాన్ని గుర్తించి, కీలక బాధ్యతలు అప్పగించారు.
ఆర్బర్ ఏకర్స్ కంపెనీలో ఫ్రాంచైజీ సిస్టం, మార్కెటింగ్ పట్ల బి.వి. రావు ఆలోచనల్ని కంపెనీ బోర్డు పట్టించుకోలేదు. సంతృప్తి లేని స్థితిలో ఆయన ఉద్యోగం మానేసి, సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ, అంత పెట్టుబడి లేదని వెనకడుగు వేశారు. అప్పుడు ఉత్తరాదేవే వెన్నుతట్టి భర్తను ప్రోత్సహించింది. ఆమెకు ఆయనపై ఎంతో నమ్మకం ఉండేది. ఆయన ఏదైనా సాధిస్తారనే నమ్మకం ఉండేది. సొంతంగా చిన్న కోళ్ల ఫారం పెట్టమని సూచించింది. అప్పటికే ఆమె భవిష్యత్ వ్యాపారం కోసం కొంతమొత్తాన్ని కూడబెట్టింది. ఆ ప్రయత్నంలో ఉత్తరాదేవి ఎన్నో ఆనందాలను త్యాగం చేసింది. చాలా ఖర్చులు తగ్గించుకున్నది. తాను దాచిన డబ్బులన్నిటినీ పౌల్ట్రీ స్థాపనకు ఖర్చు చేయమని ఇచ్చింది. కానీ, ఆ డబ్బు సరిపోలేదు. ఆప్పుడు ఇంకేమీ ఆలోచించకుండా, తన నగలన్నీ అమ్మి మరికొంత డబ్బు ఇచ్చింది. ఈ పెట్టుబడితో హైదరాబాద్ శివారులోని ఇంజాపూర్లో చిన్న స్థలం కొన్నారాయన. 1969లో ఏడు కొండలవాడిపై ఉన్న అపారమైన భక్తితో ‘వేంకటేశ్వర ఫామ్’ పేరుతో కోళ్లఫారం ప్రారంభించారు. అదే నేడు మహా వృక్షమై.. శాఖోపశాఖలుగా విస్తరించింది. ఉత్తరాదేవి ఉత్తమ సంస్కారానికి ప్రతీకగా నిలిచింది. పౌల్ట్రీ పరిశ్రమలోకి బి.వి.రావు అడుగుపెట్టడంతో.. బ్రాయిలర్ కోళ్లు, వాటి గుడ్ల ధరలు పేదవాడికి అందుబాటులోకి వచ్చాయి. నిరుపేదలు కూడా గుడ్లు తినగలిగే రోజులొచ్చాయి! ఇదంతా సిల్వర్ రెవల్యూషన్ని నిజం చేసిన బి.వి.రావు దార్శనికతతోనే సాకారమైంది. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీగా (భారతదేశ కోళ్ల పరిశ్రమ పితామహుడిగా) పిలుస్తారు.
‘వేంకటేశ్వర హేచరీస్ (వి.హెచ్)’ పౌల్ట్రీ రంగంలో పెద్దపెద్ద మార్పులకు బీజం వేసింది. పెరటికే పరిమితమైన కోళ్ల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దుతూ.. రైతులకు జీవనోపాధిని, ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించొచ్చని బి.వి. రావు కలలు కన్నారు. పౌల్ట్రీ పరిశ్రమను పీడిస్తున్న రోగాలబారి నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ల తయారీ, పరిశ్రమకు అవసరమైన యంత్రాలు, కోడిపిల్లల ప్రాసెసింగ్, సూక్ష్మక్రిములు లేని గుడ్ల ఉత్పత్తి, సూక్ష్మక్రిముల నివారణ లాంటి ఎన్నో ఆధునిక పద్ధతులను కోళ్ల పరిశ్రమకు ఆయన పరిచయం చేశారు. అమెరికాలో ప్రముఖ సంస్థ ‘బాబ్కాక్ పౌల్ట్రీ ఫారం’కు మనదేశంలో ఏకైక ఫ్రాంఛైజ్ తీసుకున్న తర్వాత సమ శీతోష్ణ వాతావరణానికి అనువైన బ్రీడ్స్ అభివృద్ధి చేసి పౌల్ట్రీ రంగానికి ‘వెంకాబ్’ అనే బ్రాయిలర్, బి.వి.300 లేయర్ బ్రీడ్స్ను అందించారు.
భారత ప్రభుత్వం 1989లో బి.వి. రావును ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. కాకతీయ విశ్వవిద్యాలయం 1992లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. వరల్డ్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ ‘ఇంటర్నేషనల్ పౌల్ట్రీ హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డు ప్రదానం చేసింది. ఇలాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. పద్మశ్రీ అందుకున్న సందర్భంగా జరిగిన ఒక సన్మాన సభలో బి.వి.రావు మాట్లాడుతూ.. “నేను ఈ స్థాయికి రావడానికి, ఇన్ని విజయాలు సాధించడం వెనుక నా మనసుకు మాత్రమే కనపడే నా భార్య అదృశ్య హస్తం ఉంది. ఆ అదృశ్య హస్తం ఎప్పుడూ నా చేయి పట్టుకుని నన్ను ఉన్నత శిఖరాలకు నడిపిస్తుంది” అని ఉత్తరాదేవి గురించి చెప్పారు.
మన దేశ ప్రజలకు బలవర్ధక ఆహారమైన గుడ్డు, చికెన్ చౌకగా దొరుకుతున్నాయంటే కారణం ఉత్తరాదేవి దార్శనికతే. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ స్ఫూర్తిని ఇప్పుడు ఆమె కుమార్తె అనురాధ జె. దేశాయ్ కొనసాగిస్తున్నారు. తండ్రి మరణానంతరం (1996) వి.హెచ్ గ్రూప్ చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించిన ఆమె కంపెనీని విజయాల బాటలో నడిపిస్తున్నారు. ‘పౌల్ట్రీ రంగంలో ఏ శిఖరాలకు చేరుకోవాలని నాన్న కలగన్నారో ఆ శిఖరాలకు చేరుకోవడమే మా లక్ష్యం. భారతదేశం ఈ రంగంలో ప్రపంచంలో ఉన్నత స్థితిలో ఉండాలన్నది మా నాన్న కల. ఆయన దూరదృష్టి వల్లే ఇప్పుడు భారతదేశం ఆహార కొరతను, పౌష్టికాహార లోపాన్ని అధిగమించింది. ఆయన బంగారు కలల్ని నిజం చేయడమే మా కర్తవ్యం. ఒక ప్రయత్నంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుదిరగక పనిచేయాలనే మా అమ్మ స్ఫూర్తే మాకు మనోబలం’ అని అనురాధా దేశాయ్ అంటున్నది.
బి.వి.రావు సొంతంగా పౌల్ట్రీ పెట్టారు. ఆర్బర్ ఏకర్స్ కంపెనీ ఉన్నతాధికారులు ఆయన రాజీనామాను ఆమోదించలేదు. పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కానీ సొంతకాళ్ల మీద నిలబడితే అంతకంటే గొప్ప జీవితం ఉంటుందని బి.వి. రావు విశ్వసించారు. అదే మాట మీద నిలబడ్డారు. కానీ, ఆర్బర్ ఏకర్స్ కంపెనీ ఆయన్ని విధుల నుంచి వెంటనే విడిచి పెట్టడానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఉత్తరాదేవి హైదరాబాద్లో మొదలుపెట్టిన కోళ్ల ఫారం బాధ్యతలు చూసుకున్నారు. మూడు నెలల తర్వాత బి.వి. రావు ఉద్యోగం మానేశారు. అయినా నెలకు ఒకసారి
ఆ కంపెనీని సందర్శించి సాంకేతిక సలహాలు ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన లేకపోయినా, అనుభవం లేకపోయినా ఫామ్ నిర్వహణ బాధ్యతలను ఉత్తరాదేవి సమర్థంగా నిర్వహించారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయన విజయానికి బాటలు వేశారు. కోళ్ల ఫారం అభివృద్ధికి ఉత్తరాదేవి ఎంతగానో కృషిచేశారు. కొంతకాలానికి సంస్థ పేరును ‘వేంకటేశ్వర హేచరీస్ లిమిటెడ్’గా మార్చారు. ఇది భారతదేశ కోళ్ల పరిశ్రమ స్థితిగతుల్ని, రూపురేఖల్ని పూర్తిగా మార్చేసింది. వేంకటేశ్వర హేచరీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బి.వి. రావు విజయంలో కీలక భూమిక పోషించిన ఉత్తరాదేవిని ఈ సంస్థకు సహవ్యవస్థాపకురాలు అని చెప్పవచ్చు. 1971లో ‘బాబ్కాక్ పౌల్ట్రీ ఫామ్’ యొక్క ఫ్రాంచైజీ అవకాశం దేశంలోని పెద్ద సంస్థలను కాదని బి.వి.రావును వెతుక్కుంటూ వచ్చింది. దీనికి
అధిక మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుందని దక్షిణ భారతదేశానికి మాత్రమే ఫ్రాంఛైజీ తీసుకోవాలని
అనుకున్నారు. ఆర్థిక భారం సమస్య అనుకొని ఈ అవకాశం వదులుకోవద్దని, భారతదేశం అంతటికీ ఫ్రాంఛైజీ తీసుకోవాలని ఉత్తరాదేవి సలహా ఇచ్చింది. ఆ ప్రయత్నంలో ఆయన్ను ప్రోత్సహించింది. నాణ్యమైన శిక్షణతోనే పౌల్ట్రీ
అభివృద్ధి ఉంటుందని బి.వి.రావుకు బలమైన నమ్మకం. శాస్త్రీయ విజ్ఞానంతో కూడిన శిక్షణ ఇవ్వాలని 1987లో ‘డా.బి.వి.రావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ’ని పుణేలో స్థాపించారు.
ఒకానొక సందర్భంలో గుడ్ల పంపిణీలో కొందరు వ్యాపారులు, దళారులు బలమైన పాత్ర పోషించేవాళ్లు. వ్యాపారులకు లాభాలు, రైతులకు నష్టాలు ఉండేవి. గిట్టుబాటు ధరలేక రైతులు కోళ్ల ఫారాలనే మూసేసే పరిస్థితి వచ్చింది. ఆ దుస్థితిపోయి రైతుకు మంచిరోజులు రావాలని ‘నా గుడ్డు, నా ధర, నా జీవితం’ అనే నినాదంతో దేశంలోని రైతులందరినీ బి.వి.రావు ఒక్కటి చేశారు. దళారీల పెత్తనం పోవాలని 25,000 రైతులు సభ్యులుగా ‘నేషనల్ ఎగ్ కో- ఆర్డినేషన్ కమిటీ (ఎన్.ఇ.సి.సి)’ని 1982లో స్థాపించారు. ఈ సంస్థ వల్ల రైతు చెప్పిన ధరకే దళారులు గుడ్లను కొనే పరిస్థితి వచ్చింది. ఎన్.ఇ.సి.సి. వల్ల ఉత్పత్తిదారులు, వినియోగదారులు లబ్ధి పొందారు. పౌల్ట్రీ రైతులంతా ఆయన జన్మదినమైన నవంబర్ 6వ తేదీని ‘ఎన్.ఇ.సి.సి డే’గా జరుపుతున్నారు.