సంచిలోని బియ్యం ఆకలి తీరుస్తుంది.సంచిలోని దుప్పటి చలి నుంచి రక్షిస్తుంది.సంచిలోని పుస్తకాలు విజ్ఞానాన్ని పంచుతాయి.అంతేనా, ఆ జనపనార సంచులు హుందాగా బతకడానికి సరిపడా ఉపాధినీ ఇచ్చాయి.వంచనకు గురవుతూ, యాచనతో పొట్టపోసుకునే ట్రాన్స్జెండర్లకు కొత్త గుర్తింపును తెచ్చాయి.తెలంగాణ సర్కారు చొరవతో సంచుల తయారీలో నైపుణ్యం సాధించి.. సంచుల కొద్దీ ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకున్న జీవితాలు అనేకం.
తెలంగాణ సర్కారు చొరవ ఆ అట్టడుగు జీవితాల్లో వెలుగులు నింపింది. జీవనోపాధి మార్గాన్ని చూపింది. మహిళా-శిశు సంక్షేమ శాఖ, వుమెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనపనార సంచుల తయారీ శిక్షణ కార్యక్రమం తమ జీవితాలను మలుపుతిప్పిందని సంతోషంగా చెబుతున్నారు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు. ‘నా వయసు యాభై అయిదు. ముప్పై అయిదేండ్లుగా భిక్షాటనతో, పడుపు వృత్తితో జీవితాన్ని వెళ్లదీశాను. ఇంటా బయటా అవహేళనలు ఎదుర్కొన్నాను. అందరిలా ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా జీవించాలని ఉండేది నాకు. కానీ ట్రాన్స్జెండర్ను కావడంతో ఆ అవకాశం లభించలేదు. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. తెలంగాణ మహిళా-శిశు సంక్షేమ శాఖ నాలాంటి ఎంతోమంది జీవితాలను బాగు చేయాలని సంకల్పించిందని తెలిసింది. జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ తీసుకున్నాను. ఇకనుంచి కష్టాన్ని నమ్ముకొని గౌరవంగా జీవించాలని అనుకుంటున్నా. ఒకప్పుడు అమర్యాదగా మాట్లాడినవారే ఇప్పుడు గౌరవంగా పలకరిస్తున్నారు. మాకు ఒక మార్గం చూపిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటున్నారో ట్రాన్స్జెండర్.
భయం నుంచి అభయానికి..
‘నేను ఇంటర్ వరకూ చదువుకున్నాను. నావల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదని ఇంటినుంచి వచ్చేశాను. బతుకుతెరువు కోసం భిక్షాటన చేశాను. భౌతిక దాడులు ఎదుర్కొన్నాను. మానసిక సంఘర్షణ అనుభవిస్తూనే ఉన్నాను. బయటికి వెళ్లినప్పుడల్లా భయంభయంగా ఉండేది. జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ తీసుకోవడంతో కొత్త ధైర్యం వస్తున్నది’ అంటున్నారు ట్రాన్స్ఈక్వాలిటీ సొసైటీకి చెందిన జాస్మిన్. మెడలో వేలాడే గుర్తింపు కార్డు వాళ్లకంటూ ఓ ‘ఐడెంటిటీ’ని ఇచ్చింది. మూడు నెలల శిక్షణ సమయంలో ట్రాన్స్జెండర్లకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. రోజుకు రూ. 200 ఉపకార వేతనం అందిస్తారు. కూకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో తొలి విడతగా 50 మంది శిక్షణ పొందారు. త్వరలోనే మరికొంతమందికి అవకాశం కల్పించనున్నారు. ‘ట్రాన్స్జెండర్లు తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం’ అని పిలుపునిస్తున్నారు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
-నూర శ్రీనివాస్