శ్రీశుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! శుక్రుని శాపంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యయాతి మామగారికి ఆవేదనతో ఇలా నివేదించాడు.. ‘మామా! నాపై తామసం- కోపం వద్దు. ఈ వామలోచన- దేవయానిపై నాకింకా కామ తాపం తీరలేదు. ఈ భామామణితో మరికొంత కాలం ప్రేమతో రమించి ఆపై ముదిమిని పొందుతా’. ఇలా అర్థించగా, క్రోధావేశంతో తన కూతురి సుఖానికే పాతర వేసే ఈ తీరు శాపం పెట్టానని కాతరుడై తేరుకొని శుక్రుడు ప్రసన్నుడై యయాతితో- ‘ఏ యువకుడైనా నీ వృద్ధాప్యం స్వీకరించి నీకు యవ్వనం ఇచ్చినట్లయితే దానిని గ్రహించి నీవు యథేచ్ఛగా ఇంద్రియ సుఖం అనుభవించగలవు’ అని తన పరివాదా (శాపా)నికి పరిహారం ప్రసాదించాడు. ఈ యవ్వన ‘వినిమయం’- ఆదాన ప్రదానం (ఇచ్చిపుచ్చుకోలు) అన్న విషయం పోతన భాగవతంలో లేదు. నిగ్రహానుగ్రహ సమర్థుడైన భార్గవు-శుక్రుని, గీతలో భగవంతుడు తన విభూతి (కవీనా ముశనా కవిః)గా పేర్కొన్నాడు. శుక్రుని అనుగ్రహం- ఈ తీర్పు లేకపోతే యయాతికి ఈ మార్పిడి ఏర్పడేది కాదు. ‘ఇతి లబ్ధ వ్యవస్థానః’ (ఇట్టి వ్యవస్థను పొందిన యయాతి) అని మూలంలోని మాట.
దేవయానితో కూడి రాజధాని నగరానికి తిరిగి వచ్చిన భూజాని (రాజు) యయాతి, పెద్ద కొడుకు యదువుతో యవ్వనం ఇమ్మని అడిగాడు. ‘తండ్రీ! ముద్దుగుమ్మలాంటి కమ్మని యవ్వనాన్ని వమ్ము చేసుకొని ఘోరమైన జరను ఎవరైనా కోరి వరిస్తారా? సర్వసుఖాలకు నెలవై జీవన సారమైన ప్రాయాన్ని- పడుచుదనాన్ని కన్నతండ్రికైనా తేరగా జారవిడుచుకోగలరా?’ ‘కామిగాని వాడు మోక్షగామి కాడు గదా!’ అన్నట్టు వాడు సున్నితంగా తిరస్కరించాడు. తుర్వస, ద్రుహ్య, అనువులు ముగ్గురూ కూడా తండ్రి మాటను పెడచెవిన పెట్టారు. అప్పుడు యయాతి- ‘కన్నా! నువ్వు వయసులో పిన్నవైనా బుద్ధిలో నీ అన్నల కన్నా మిన్నయైన వాడవు. నాపై మన్నన- గౌరవంతో నీ తారుణ్యాన్ని నాకిచ్చి, నా ముదిమిని నీవు తీసుకో. బిడ్డా! నాపై కారుణ్యం చూపు’ అంటూ పూరువును కోరాడు. అతడు మారు మాట్లాడక ‘అయ్యా! నన్నింతగా వేడుకోవాలా? తండ్రి కోరితే కాదని కయ్యానికి కాలుదువ్వే కొడుకు క్రిమి- పురుగుతో సమానం. నాన్నగారూ! తండ్రుల ఇంగితం తెలుసుకొని చెప్పకనే చేయు అంగజులు- కొడుకులు ప్రథములు. చెప్పగా విని ఆ చొప్పున చేయువారు మధ్యములు. ఆజ్ఞాపించినా ఆలకించక అవజ్ఞ- అనాదరణతో చేయకుండా అడ్డుచెప్పే కొడుకులు అధములు- బహు చెడ్డవారు’ అని పూరువు తండ్రి వృద్ధాప్యాన్ని ఆప్యాయంగా స్వీకరించి తన పరువాన్ని తృణప్రాయంగా తండ్రికి ధారపోశాడు.
శుకుడు- రాజా! ఇతడే తండ్రి తరువాత రాజ్యపాలనకు పూజ్య అధికారి అయ్యాడు. యదువు కిరీటధారణకు అధికారం కోల్పోయాడు. దేవయానీ శర్మిష్ఠలు- ఈ కుందరదనలిద్దరూ చంద్రవంశంలోని రెండు పెద్దశాఖలకు- యాదవ, పౌరవ వంశాలకు మాతృదేవతలయ్యారు. యాదవ వంశంలో ‘శిరోరత్నం’గా శ్రీకృష్ణుడు అవతరించగా, పౌరవ వంశంలో కౌంతేయులు- మీ పెద్దలు పాండవులు ప్రభవించి దానిని గౌరవాన్వితం చేశారు. పరీక్షిన్మహారాజా! యువకుడైన యయాతి ఏడు ద్వీపాల ధరణికి ఏకైక రేడై (రాజై) వేడుక మీర వైదిక మార్గంలో రాజ్యం చేశాడు. దేవయాని తోడునీడై అనుసరించగా ఇంద్రియ లోలుడై మన్మథ సుఖాల్లో మునిగితేలాడు. ఇలా ఎడలేక వెయ్యేండ్లు అనుభవించినా తన కామ తృష్ణకు కడ- అంతం కానలేకపోయాడు.
ఒక శుభదినాన పశ్చాత్తప్తుడై అంతర్ముఖత్వంతో ఆత్మజ్ఞానం పొందిన కతన తప్పు తెలుసుకొని తన తారుణ్యాన్ని తిరిగి తనయుడికి అప్పగించాడు. ఇలా యవ్వనాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానం- ఈ ‘హార్మోన్ థియరీ’ ఆ రోజుల్లో కూడా వాడుకలో ఉండేదన్నమాట! పడతి- స్త్రీ నిమిత్తంగా తాను మోసపోవడం గుర్తించి యయాతి అతి దుఃఖితుడై తన సతితో ఇలా వాపోయాడు. పరీక్షిత్తూ! రెండు యవ్వనాల రతి సుఖం అనుభవించిన, విశ్వ ఇతిహాసంలో విఖ్యాతి గన్న ఏకైక వసుమతీ పతి- మహారాజు యయాతి తన గతానుభవ సారాన్ని సతీమూలకంగా భావితరాల సంతతికి కనువిప్పు కలిగేలా ఇలా నీతిని బోధించాడు… ఓ నెలతా! వెయ్యేండ్లు నిన్ను కూడి ఉన్నా. అయినా ఈ పాపిష్టి తృష్ణ నన్నింకా పీడిస్తూనే ఉంది. ప్రాణాలు వేగిపోతున్నా ఇది చెలరేగుతూనే ఉంది. సర్వాంగాలు సన్నగిల్లినా ఇది నన్ను వదలదు. ఈ ఆశకు అంతులేదు కాన దీనికి వంతపాడకుండా బలవంతంగానే తుంచివెయ్యాలి.
కం॥ ‘ముదిసెను దంతావళియును
ముదిసెను కేశములుఁ దనువు ముదిసెం దనకున్
ముదియనివి రెండు చిక్కెను
బ్రదికెడి తీపియును విషయ పక్ష స్పృహయున్’
ఓ పూబోడీ! దంతాలన్నీ ముదిసి ఊడిపోయాయి. జుట్టంతా ముదిసి ముగ్గుబుట్టగా- తెల్లగా మారింది. ఒడలు- శరీర అవయవాల బిగి కూడా సడలిపోయింది. తనువు- దేహం అంతా వడలినా, ఓ కాంతా! మనువు- బతుకు మీది తీపి (రక్తి), విషయ సుఖాలపై ఆసక్తి- ఈ రెండూ మాత్రం ముదియకుండా అంతకంతకూ తారుణ్యాన్ని సంతరించుకొంటున్నాయి.
కం॥ ‘కడ లే దాశాలతకును
గడఁజూడఁగ గానరాదు కడఁ గనిరేనిన్
గడుముదమున సంసారము
గడఁగందురు తత్తవిదులు కమలదళాక్షీ’
‘ఓ తామర రేకులవంటి కన్నులు కలదానా! కడలి వలె కడ- అంతం లేని ఆశాలతకు నిలకడగా అంతు కనుగొందామన్నా అది కానరాదు. తత్తవేత్తలు దురాశకు కడచూడ గలిగితే కడు సంతోషంతో సంసారం కడ ముట్టగలరు. పారం- తీరం పొందగలరు’. అమూలకాలైన పై రెండు కందాలు అమాత్యుని అక్షయ జ్ఞాన వైరాగ్య మరందాల అక్షర అరవిందాలు!
ఆ॥ ‘అక్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన
పానుపెక్కఁ జనదు పద్మ నయన
పరమ యోగికైన బలిమిని నింద్రియ
గ్రామ మధికపీడఁ గలుగఁ జేయు’
‘ఓ పద్మాక్షీ! పరమ నిష్ఠా గరిష్ఠుడైన యోగికైనా బలిష్ఠమైన ఇంద్రియాలు నష్టాన్నీ, అరిష్టాన్నే కలిగిస్తాయి. అవి ఎంత అవిశ్వసనీయాలు- నమ్మతగ్గవి కావంటే, తల్లీకూతుళ్లు, అక్కాచెల్లెళ్లు కూర్చున్న మంచం మీద కూడా మక్కువతో తాను ఎక్కి కూర్చోరాదు. ఎంత పండితుణ్నైనా అవి వెక్కిరించి ఎంచక్కా పక్కాగా బొక్కబోర్లా పడేస్తాయి. దుష్టములైన ఆ ఇంద్రియాలు తుష్టీకరణ- సంతృప్తి పరచడంతో ఎన్నటికీ సంతుష్టి చెందవు. వాటి స్వభావం ఎంత నికృష్టమంటే- తమకు పుష్టిని చేకూర్చే ఇష్టుడైన యజమానిని- పోషకుని కూడా అవి తమ ముష్టి- గుప్పెటలో పెట్టుకోవడానికే పాటుపడతాయి!
యయాతి దేవయానితో- ‘ఓ వరాననా! జనారణ్యంలో మానవ మృగాల సాంగత్యం కన్నా అరణ్యంలో వన్యమృగాల సహవాసమే మిన్న. కాన, నేను కాననాని (అడవి)కి వెళ్లి మృగాలతో కలిసి జీవిస్తా’ అంటూ పూరువును సార్వభౌముడిగా చేసి, రెక్కలు వచ్చిన పక్షి గూటిని వదలునట్లు యయాతి రతి సుఖం త్యజించి పరమాత్మయందు మతి నిలిపి భాగవతుల గతిని పొందాడు. దేవయాని కూడా పతిని అనుసరించి తరించింది.
(సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006