IPL | మల్లిక సాగర్.. ముంబైలో పుట్టింది. ముగ్గురు తోబుట్టువుల మధ్య పెరిగింది. ‘నేనేం సృజనాత్మక వ్యక్తిని కాదు. గొప్ప చిత్రకారిణిని కూడా కాదు’ అంటారు కానీ, రెండు ప్రక్రియల్లోనూ ఆమె సిద్ధహస్తురాలే. తండ్రి నుంచి పుస్తక పఠనం అబ్బింది. అదే, తనలో ఆలోచనల విత్తులు నాటింది. క్రమంగా చరిత్ర మీద ఆసక్తి పెరిగింది. అందులోనూ ప్రాచీన చిత్రకళను అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. అంతర్జాతీయ సంస్థ క్రిస్టీ నిర్వహించే కళాఖండాల వేలంపాట తరచూ టీవీలో వీక్షించేది మల్లిక.
ఆ ప్రభావంతో, వేలందారుగా స్థిరపడాలనే ఆలోచన కలిగింది. అమెరికా వెళ్లి అందుకు అవసరమైన శిక్షణ తీసుకుంది. పదమూడేండ్ల క్రితం అరుదైన బేస్బాల్ క్రీడా సామగ్రి వేలం పాటను తన చేతుల మీదుగా నిర్వహించింది. ‘ఈ వృత్తిలో స్థిరపడటం అంత సులభం కాదు. రెప్పపాటు సమయంలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండాలి. కించిత్ హాస్య స్పృహ కూడా అవసరమే’ అంటారామె. కొవిడ్ సమయంలో ఐపీఎల్ ప్రధాన వేలందారుకు సహాయకురాలిగా పనిచేసే అవకాశం దొరికింది. అదే మహద్భాగ్యం అనుకుంది మల్లిక. ఈ మధ్య దుబాయ్లో జరిగిన వేలం పాటలో తన చేతుల మీదుగానే రెండొందల కోట్ల వ్యాపారం జరిగిపోయింది. ఐపీఎల్ తొలి మహిళా వేలంపాట నిర్వాహకురాలిగా రికార్డు సృష్టించింది. గత ఇరవై ఏండ్లలో ఆమె విద్య, వైద్యం, క్యాన్సర్ కేర్.. ఇలా సామాజిక బాధ్యతలతో ముడిపడిన వేలంపాటలనూ సమర్థంగా నిర్వహించింది.