స్నానం.. మానవజాతి వికాసాన్ని సూచిస్తుంది. శరీరానికి పరిశుభ్రతను, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. స్నానాన్ని పిల్లలు ఎంతో ఆస్వాదిస్తారు. పెరిగి పెద్దవుతున్నకొద్దీ స్నానమనగానే ఏడవకుండా పరిగెత్తుకుని వస్తారు. పసిబిడ్డలకు నెమ్మదిగా, ఓపికగా, ప్రేమగా స్నానం చేయించాలి. తొందరపాటు పనికిరాదు.
పుట్టినప్పుడు బిడ్డ బరువు 2,500 గ్రాములలోపు ఉంటుంది. బొడ్డు ఊడేవరకు తడిగుడ్డతోనే శరీరమంతా తుడవాలి. దీనినే ‘స్పాంజ్ బాత్’ అంటారు. శిశువు జన్మించిన వెంటనే స్నానం చేయించకూడదు. 2-6 గంటల పాటు విశ్రాంతి ఇవ్వాలి. దీంతో ప్రసవం వల్ల కలిగిన అలసట తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ వ్యవస్థ సాధారణ స్థాయికి వస్తాయి.ఎండిపోయిన రక్తపు మరకల్ని మొదటి స్నానంలో కడగాలి. శరీరంపై ఉన్న ‘వెర్నిక్స్’ను మృదువుగా శుభ్రం చేయాలే తప్ప బలవంతంగా తుడిచేయడానికి ప్రయత్నించరాదు. స్నానాల గది ఉష్ణోగ్రత 27 డిగ్రీలకన్నా తక్కువ ఉండకూడదు. నీరు గోరువెచ్చగా (90-100 డిగ్రీల ఫారన్ హీట్) ఉండేలా జాగ్రత్తపడాలి. స్నానం ప్రారంభించడానికి ముందే సబ్బు, టవల్, ఇతర వస్తువులు సిద్ధంగా ఉంచుకోవాలి. పాలు తాగించిన వెంటనే స్నానం చేయిస్తే పొట్టపై ఒత్తిడి పెరిగి వాంతి కావచ్చు. పాలు తాగిన రెండు గంటల తరువాత, ఉదయం 10-11 గంటల సమయంలో స్నానం చేయిస్తే వెంటనే పాలు తాగి నిద్రపోతారు. స్నానం ప్రారంభించిన మొదటిరోజే ఎక్కువగా ఏడిస్తే, స్పాంజ్ బాత్ ఇచ్చి వారం తరువాత తిరిగి ప్రయత్నించాలి. స్నానం ఐదు నిమిషాలకన్నా ఎక్కువసేపు కొనసాగితే చర్మం పొడిబారిపోతుంది. మరీ చలికాలం అయితే, స్పాంజ్ బాత్ సరిపోతుంది. మొదటి నెల రోజులు సబ్బు వాడనవసరం లేదు. ఆ తరువాత కూడా ముఖానికి ఎక్కువగా వాడకూడదు. తలకు వారానికి రెండుసార్లు షాంపూ చేస్తే సరిపోతుంది.
ఇదీ పద్ధతి
మన సంప్రదాయం ప్రకారం తల్లి కూర్చొని, కాళ్లు రెండూ బారుగా చాపి ఒకదానికొకటి దగ్గరగా ఉంచి రెండు కాళ్లమధ్య శిశువును పడుకోబెట్టి స్నానం చేయించవచ్చు. శిశువును నెమ్మదిగా కూర్చోబెట్టి కూడా చేయించవచ్చు. తలకు షాంపూ పెడుతున్నప్పుడు నీళ్లు కళ్లలో పడకుండా, నోట్లోకి వెళ్లకుండా కంటి పైభాగంలో.. నుదిటిపై చెయ్యి అడ్డంగా ఉంచాలి. శిశువు ఏడుస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు సబ్బు నీళ్లు నోటి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ‘ఆస్పిరేషన్ న్యుమోనియా’కు దారితీయవచ్చు. దీనివల్ల మరణం సంభవించే ప్రమాదమూ ఉంది. స్నానం చేయిస్తున్నప్పుడు మెడ, చెవి వెనుక భాగం, చంకలు, జననాంగాలు, మలద్వారం మరింత శ్రద్ధగా కడగాలి. వెంటనే తుడవాలి కూడా. తడితడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. మలద్వారం కడుగుతున్నప్పుడు, ముందు జననాంగాల దగ్గర ప్రారంభించి వెనకకు.. మలద్వారం వైపునకు వెళ్లాలి. దీనివల్ల మలవిసర్జనలో బయటికి వచ్చే బ్యాక్టీరియా మూత్ర వ్యవస్థకు చేరి ఇన్ఫెక్షన్కు దారి తీయకుండా నివారించవచ్చు. స్నానం ముగిసిన వెంటనే తలతో ప్రారంభించి పొడి గుడ్డతో తుడవాలి. జుట్టు ఎక్కువగా ఉంటే బ్రష్ వాడవచ్చు.
మర్దన మంచిదే
శిశువులకు మర్దన హాయినిస్తుంది. ఇందుకు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ వాడవచ్చు. ఆముదం నూనె మాత్రం వాడకూడదు. మసాజ్ వల్ల శరీర భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెంది, అలసట తీరుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. మసాజ్ చేసిన వెంటనే కాకుండా, కనీసం 30 నిమిషాల తర్వాత స్నానం చేయించాలి.
డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు