గుడ్లగూబను చెడుకు సంకేతంగా భావిస్తారు కదా! మరి ఆ పక్షి లక్ష్మీదేవికి వాహనం ఎలా అయ్యింది?
– ఎ.హన్మంతరావు. మోహినికుంట
సిరులనిచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ. రమాదేవి స్వామివారితో కలిసి జంటగా ప్రయాణించేటప్పుడు గరుత్మంతుడినీ, ఒంటరిగా ప్రయాణించేటప్పుడు గుడ్లగూబనూ వాహనంగా ఎంచుకుంటుందని పురాణాల ద్వారా తెలుస్తున్నది. సంపదలకు నెలవైన లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా మారడం వెనక ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. పూర్వం భువనేశుడు అనే రాజు ఉండేవాడు. తన రాజ్యంలో దైవాన్ని వేదమంత్రాలతో మాత్రమే ప్రార్థించాలని ఆయన శాసించాడు. నామ సంకీర్తనలు పాడేవాళ్లను రాజ్యం నుంచి బహిష్కరించేవాడు. ఈ క్రమంలో హరిమిత్రుడనే భక్తుడు రాజాజ్ఞను మీరి మధురమైన గీతాలతో దేవుడిని కీర్తించాడు.
విషయం తెలుసుకున్న భువనేశుడు ఆ భక్తుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు. ఆ పాప ఫలితంగా మలిజన్మలో భువనేశుడు గుడ్లగూబగా జన్మించి అందరి ఛీత్కారాలూ అనుభవించసాగాడు. ఆ సమయంలో రాజ్య బహిష్కరణకు గురైన భక్తుడి అనుగ్రహంతో ఆ గుడ్లగూబ గొప్ప సంగీత విద్వాంసుడిగా మారుతుంది. బ్రహ్మదేవుడి మానస పుత్రుడైన నారదుడికి ఆ విద్వాంసుడే సంగీతం నేర్పాడు. నారదుడు గురుదక్షిణ ఏమివ్వాలని కోరగా, ‘ఈ భూమి ఉన్నంత కాలం సంగీతకళతోపాటు తన పేరూ శాశ్వతంగా నిలిచిపోవాల’ని అడుగుతాడు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవికి గుడ్లగూబను వాహనంగా ఉండే వరాన్ని గురుదక్షిణగా సమర్పించాడు. అప్పటినుంచి గానబంధువైన గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారింది.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370