ఒకసారి ఆశ్రమంలో ఓ భక్తుడు తప్పు చేస్తే, మిగతావారంతా రమణ మహర్షికి ఫిర్యాదు చేశారు. అతణ్ని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టాలని అడిగారు. అప్పుడు మహర్షి అతణ్ని పిలిచి, నాలుగు మంచిమాటలు చెప్పి, ఆశ్రమం లోపలికి వెళ్లమన్నారు. మిగతా భక్తులు ‘ఇలా అయితే ఎలా స్వామీ! తప్పుచేసిన వాళ్లను ఆశ్రమంలో ఉంచుకుంటే ఎలా? మీ పరువేం కాను? వాడిని బయటికి పంపేయవచ్చు కదా!’ అన్నారు. అప్పుడు మహర్షి నిశ్చలంగా ‘తప్పులు ఎంచి ఇక్కడినుంచి పంపించాల్సి వస్తే, ఒక్క పక్షి కూడా ఆశ్రమంలో మిగలదు.
నేను ఒక్కడినే ఉండాల్సి వస్తుంది’ అంటూ మౌనంగా అరుణగిరి ప్రదక్షిణకు బయలుదేరారు. ఇలా రమణులు ఎన్నడూ ఎవరినీ దోషులుగా చూడకపోయేవారు. అందుకే కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి ‘మహాశివుడు క్షీరసాగర మథనం నుంచి వచ్చిన చంద్రుడిని తలపై పెట్టుకున్నాడు. గరళాన్ని గొంతులో దాచుకున్నాడు. అలాగే మహాత్ములు ఇతరుల మంచిని గురించి నలుగురి ముందు గొప్పగా చెబుతారు. దోషాలు కనిపిస్తే గుప్తంగా తమలోనే దాచుకుంటారు’ అని పేర్కొన్నారు.
– మనోజ్ఞ