నమ్మకం! దోస్త్ అంటే నమ్మకం! దోస్తీ అంటే నమ్మకం!! ఆ నమ్మకం మీదే వెండితెరపై దోస్తీ సినిమాలు మస్తీ చేశాయి. స్నేహితుడి గొప్పదనాన్ని తెలియజేస్తూనే, సమాజ హితాన్నీ కాంక్షించాయి. ఆ వెండితెర మెరుపుల్లోని కొన్ని తునకలు ఇవి. ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా గుర్తుచేసుకోదగ్గవి.
‘యేఁ దోస్తీ హమ్ నహీ తోడేంగే! తోడేంగే దమ్ అగర్ తేరే సాత్ న చోడేంగే॥’- ప్రాణం పోయే వరకూ మన స్నేహం వీడిపోదు! 1975లో విడుదలైనా.. ఇప్పటికీ, ఈ క్షణంలో ఏ ఇంట్లోనో, మరే ఫోన్లోనో ప్రసారమవుతున్న సినిమా షోలే. ఫ్రెండ్షిప్ డే వచ్చిందంటే ఆ సినిమాలోని ‘యేఁ దోస్తీ..’ పాట వాట్సాప్ స్టేటస్గా మార్మోగుతూనే ఉంటుంది. అరెయ్-తురెయ్ అనుకునే జాన్జిగిరీ దోస్తానా కాదు జయ్, వీరూలది. ఎడాపెడా తిట్టుకునే పోకిరీలు. ఎవరైనా అడ్డొస్తే ఇద్దరూ ఒక్కటై కుళ్లబొడుస్తారు. ఫక్తు దొంగలు. ఓ మాజీ పోలీస్ అధికారి పిలుపుతో రామ్గఢ్ చేరుకుంటారు ఇద్దరూ. ప్రజలను పీడిస్తున్న గబ్బర్సింగ్ను ప్రాణాలతో తెచ్చి ఠాకూర్కు అప్పగిస్తామని బేరం కుదుర్చుకుంటారు.
ఫ్లాష్బ్యాక్..
పోలీస్గా ఉన్నరోజుల నుంచీ ఠాకూర్కు జయ్-వీరూ తెలుసు. ఈ ఇద్దరు మిత్రులు ఎంతటి దొంగలైనా.. మంచి పనిమంతులుగా గుర్తిస్తాడు. నమ్మకస్తులు అని విశ్వసిస్తాడు. అందుకు కారణమూ లేకపోలేదు. ఒకసారి ఇద్దరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, వాళ్లు ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుపై దొంగలు దాడికి దిగుతారు. వారిని ఎదుర్కొనే క్రమంలో ఠాకూర్కు బుల్లెట్ గాయాలవుతాయి. ప్రాణాల మీదికి వస్తుంది. పారిపోవడానికి ఇదే మంచి తరుణం అంటాడు వీరూ. దవాఖానలో చేర్చాక గానీ, ఆయన్ని వదిలేది లేదని అంటాడు జయ్. బొమ్మా-బొరుసు వేసి తేలుద్దాం అనుకుంటారు. బొమ్మ పడితే ఆస్పత్రిలో చేర్పించాలి! బొరుసు పడితే అతణ్ని వదిలేసి పారిపోవాలి. బొమ్మ పడుతుంది. గాయపడిన ఠాకూర్ను ఆస్పత్రిలో చేర్చాక వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోతారు.
కట్ చేస్తే.. గబ్బర్సింగ్ డెన్కు ఇద్దరిలో ఒకరే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ‘నేను వెళ్తాను!’ అంటాడు వీరూ. ‘కాదు, నేను వెళ్తాను’ అంటాడు జయ్. మళ్లీ నాణెం గాల్లోకి ఎగురుతుంది. ఈసారీ బొమ్మే పడుతుంది. వీరూ ఓడిపోతాడు. జయ్ గబ్బర్సింగ్పైకి యుద్ధానికి ఒంటరిగా వెళ్తాడు. విలన్ గ్యాంగ్ను తుత్తునియలు చేస్తాడు. తనూ తీవ్రంగా గాయపడతాడు. పరుగు పరుగున వీరూ వస్తాడు. అతని ఒడిలోనే శాశ్వతంగా నిద్రిస్తాడు జయ్! అతని పిడికిలిలో నాణెం కనిపిస్తుంది. జయ్ చేతిలోని నాణేనికి రెండోవైపూ బొమ్మే ఉండటాన్ని గమనిస్తాడు వీరూ. అందులో తన స్నేహితుడు జయ్ ప్రతిరూపం కనిపిస్తుంది. తన కోసం అతను చేసిన త్యాగం కనిపిస్తుంది.
ఒకసారి తన స్నేహితుడు తప్పుదారి పట్టకుండా మోసం చేశాడు. మరోసారి ఆ స్నేహితుడి ప్రాణాలను కాపాడేందుకు మోసం చేశాడు. నిజమైన స్నేహితుడు చేసే మోసమూ స్నేహం కోసమే! అందుకే, షోలే.. గబ్బర్సింగ్ కథే అయినా, ఠాకూర్ ప్రతీకార కథ అయినా.. మచ్చలేని వీరూ-జయ్ స్నేహానికి మెచ్చు తునకలా నిలిచిపోయింది.
ఆనంద్ అల్లరివాడు. ఉన్నచోట ఉండడు. మనసుకు తోచింది అనేస్తాడు. దారిన పోయే దానయ్యను కూడా పదేండ్ల పరిచయం ఉన్నవాడిలా పలకరిస్తాడు. ఆ చనువుతోనే డాక్టర్ బెనర్జీనీ పలకరిస్తాడు. ఆనంద్ ప్రవర్తన మొదట్లో డాక్టర్కు నచ్చదు. చాలాసార్లు నొచ్చుకుంటాడు. ఆనంద్ మాత్రం డాక్టర్ను ఆత్మీయుడిగా భావిస్తాడు. బాబూ మొషాయ్ అని పిలుస్తూ ఉంటాడు. అస్తమానం ఆనంద డోలికల్లో తేలాడే ఆనంద్కు భయంకరమైన వ్యాధి ఉందని డాక్టర్ బెనర్జీకి తెలుస్తుంది. అర్థం కానీ పజిల్ లాంటి జీవితాన్ని సంతోషం అనే అక్షరాలతో పూరిస్తున్న ఆనంద్ తత్వాన్ని నిదానంగా అర్థం చేసుకుంటాడు. స్నేహితుడిగా భావిస్తాడు. అతని స్నేహంలోనే నిజమైన ఆనందం ఉందని గ్రహిస్తాడు. సినిమా విషాదాంతంగా ముగుస్తుంది. కానీ, ఆలస్యంగా అయినా వారిద్దరి మధ్య చిగురించే స్నేహం.. మన మనసులోనూ చిరుదివ్వెలు వెలిగిస్తుంది. జీవితానికి స్నేహితుడి అవసరం ఎంతన్నది చెబుతుంది. రాజేశ్ఖన్నా, అమితాబ్ బచ్చన్ ప్రధాన తారాగణంగా నటించిన ‘ఆనంద్’ సినిమా మీ దోస్తుతో కలిసి చూడండి. ఆనంద్గా రాజేశ్ఖన్నా నటన అద్భుతం అనిపిస్తుంది. డాక్టర్గా అమితాబ్ పెర్ఫార్మెన్స్ ఆశ్చర్యపరుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ సినిమాలోని పాటలు కలకాలం గుర్తుండిపోతాయి.
ఇద్దరు దివ్యాంగుల స్నేహగీతిక ‘దోస్త్తీ’. రాము నడవలేడు. మోహన్ చూడలేడు. రాము మౌత్ ఆర్గాన్ అద్భుతంగా వాయించగలడు. మోహన్ అత్యద్భుతంగా పాడగలడు. విధి విలాసం ఈ ఇద్దరినీ స్నేహితులను చేస్తుంది. సంగీత సాహిత్యాల్లా ఇద్దరూ కలిసిపోతారు. అంతలోనే, కాలం ఇద్దరినీ దూరం చేస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకరు స్నేహితుడి గురించి పరితపిస్తుంటారు. ఒకరికి తెలియకుండా ఒకరికి సాయపడుతుంటారు. ఆ స్నేహబంధాన్ని విడదీయలేక కాలం ఓడిపోతుంది. రాము గెలుపు కోసం మోహన్ గళమెత్తుతాడు. మోహన్ పిలుపు కోసం రాము పరితపిస్తాడు. చివరికి వీరిద్దరి ‘దోస్తీ’ సుఖాంతం అవుతుంది. ‘జానేవాఁలో జరా.. ముడ్కే దేఁఖో ముఝే..’, ‘చాహుంగా మై తుఝే సాంజ్ సవేరే..’ తదితర పాటలు ఎవర్గ్రీన్ నంబర్స్గా నిలిచిపోయాయి… తెరమీద రాము, మోహన్ స్నేహంలా!
మిత్రలాభం
స్నేహితుల కథ అంటే అందరికీ ఆసక్తే! అందుకే ఆనాటి ‘బాలమిత్రుల కథ’ మొదలు నిన్నటి ‘ట్రిపుల్ ఆర్’ వరకు దోస్తానా సెంటిమెంటును వండి వెండితెరపై వడ్డించారు. మిత్రలాభం, మిత్రభేదం ఫార్ములాతో నిర్మించిన సినిమాల్లో సింహభాగం హిట్ కొట్టినవే! ఎన్టీఆర్, జగ్గయ్య నటించిన ‘గుడిగంటలు’, కృష్ణ, శోభన్బాబు హీరోలుగా తెరకెక్కిన ‘మంచి మిత్రులు’ ఇలా చెబుతూపోతే బోలెడన్ని సినిమాలు కనిపిస్తాయి. ప్రతి ఏడాది దోస్తీ కథాంశంతో ఒకటో రెండో సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. ముగ్గురు మిత్రులు, దళపతి, కొండపల్లి రాజా, ప్రేమదేశం, స్నేహం కోసం, ఇద్దరు మిత్రులు, ఇద్దరు ఇలా ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు స్నేహం విలువను తెలియజేస్తూనే, నిర్మాతలకు లాభాలను పంచిపెట్టాయి.
ముగ్గురి కథ..
‘ఏం స్నేహితులో ఏమిటో?’ పెద్దల పెదవి విరుపు. ‘వాడితో ఫ్రెండ్షిప్ మానెయ్’ క్లాస్టీచర్ వార్నింగ్. ఈ హెచ్చరికలు విన్నంత వరకే! గడప దాటగానే దోస్తీ మస్తీ మళ్లీ మామూలే! ఒక వ్యక్తిపై కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, చదువు చెప్పినవాళ్ల కన్నా ఎక్కువ ప్రభావం స్నేహితుడిదే ఉంటుంది. అలా ఓ స్నేహితుడి ప్రేరణతో ఓ ఇద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయో చెప్పిన కథే ‘త్రీ ఇడియట్స్’. ఆమిర్ఖాన్ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అంతకుమించి స్నేహితుడిపై నమ్మకాన్ని మరింత పెంచింది. ఇష్టమైనదాన్ని వదులుకోవద్దని ఒక మిత్రుడికి, ఏ పని అయినా కష్టంగా చేయొద్దని మరో స్నేహితుడికి హితబోధ చేసి వారి జీవితాలను మార్చేస్తాడు కథానాయకుడు. తను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. కాస్త ఫిక్షన్ అనిపించినా, నిజమైన స్నేహితుడు దారి తప్పుతున్న మిత్రుణ్ని చూస్తూ విడిచిపెట్టడు. బతిమాలో, బలవంతంగానో సరైన మార్గంలో మళ్లిస్తాడు. మీ దారిని తీర్చిదిద్దిన మిత్రుడితో కలిసి ఈ రోజు ‘త్రీ ఇడియట్స్’ సినిమా మరోసారి చూసేయండి మరి.