అరవై వచ్చేదాకా అద్భుతాలు చేసిన ఆ చేతులు అప్రయత్నంగా కదులుతుంటాయి. అందమైన దస్తూరీ రాసిన ఆ వేళ్లు.. అదేపనిగా వణికిపోతుంటాయి. కాలంతో పరుగులు తీసిన కాళ్లు.. అడుగు ముందుకు వేయడానికి సంకోచిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే.. ఆ వ్యక్తి పార్కిన్సన్స్ వ్యాధికి చేరువైనట్టే! శేష జీవితంలో నిబ్బరంగా ఉండాల్సిన ఎందరో ఈ పార్కిన్సన్స్ బారినపడి చివురుటాకుల్లా వణికిపోతున్నారు. సరైన సమయంలో లక్షణాలను గుర్తించి, డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) చికిత్స తీసుకున్నట్లయితే వణుకుడుకు విరుగుడు లభిస్తుందని భరోసా ఇస్తున్నారు వైద్యులు. అసలు పార్కిన్సన్స్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? దానిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం..
పార్కిన్సన్స్ రుగ్మతను సాధారణ భాషలో ‘వణుకుడు వ్యాధి’ అంటున్నారు. ఇది నరాలకు సంబంధించినది. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు దెబ్బతినటం, క్షీణించటం కారణంగా ఈ వ్యాధి తలెత్తుతుంది. మెదడులోని వివిధ భాగాలు శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్)కి తోడ్పడే కీలకమైన రసాయనం డోపమైన్. దీనిని తయారుచేసే కణాలు క్షీణించటం వల్ల దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. దీంతో శరీర భాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. వృద్ధులు ముఖ్యంగా అరవై ఏండ్లు పైబడిన వాళ్లే ఎక్కువగా పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇలాంటి కేసుల్లో చిన్నవయసులోనే పార్కిన్సన్స్ బారినపడే ప్రమాదం ఉంది. మనదేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఒక అంచనా!. సరైన సమయంలో డాక్టరును సంప్రదించి ఆధునిక ఏర్పాట్లుగల ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవటం ద్వారా దీనిని అదుపు చేసేందుకు వీలుంటుంది.
జన్యుపరమైన కారణం: అత్యధిక కేసులలో పార్కిన్సన్స్ వ్యాధి వంశపారంపర్యంగా రావటంలేదు. అయితే వ్యాధికి గురైన వారిలో 15-25 శాతం మంది కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉంటున్నది.
వాతావరణ కాలుష్యం: రసాయనాలు ఉత్పత్తి అయ్యే పరిసరాల్లో ఉండే ప్రజల్లో డోపమైన్ తయారీ శక్తి దెబ్బతింటున్నదని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. డోపమైన్ లోపం సహజంగానే వణుకుడు వ్యాధికి దారితీస్తుంది.
క్రిమి, కీటకనాశనులు: కాయగూరలు, ఆహారపంటలపై ఉండే క్రిమి సంహారక మందుల అవశేషాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరటం వల్ల మెదడులోని డోపమైన్ను ఉత్పిత్తి చేసే నాడీ కణాలు చనిపోతున్నట్లు భావిస్తున్నారు.
వయసు: వణుకుడు వ్యాధికి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కారణం వయసు పైబడటం. ప్రధానంగా అరవై ఏండ్లు దాటిన వారే ఈ వ్యాధికి గురవుతున్నారు. వీరిలో స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే వణుకుడు వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నది.
తలకు గాయం: తలకు తీవ్రమైన గాయం కావటం పార్కిన్సన్స్ వ్యాధి రావటానికి గల అవకాశాలను గణనీయంగా పెంచుతున్నది.
లోహపు గనుల్లో పని: మనదేశంలో మాంగనీస్ గనులలో పనిచేసిన కార్మికులలో ఎక్కువమంది పార్కిన్సన్స్ వ్యాధికి గురవుతున్నట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంలో ఆహార పదార్థాల రుచి, వాసన గుర్తించటంలో లోపం ఏర్పడుతుంది. ఇదివరలో ఎంతో ఇష్టంగా తిన్న వంటల పట్ల క్రమంగా ఆసక్తి పోతుంది. రుచిని, పరిమళాన్ని గుర్తించలేని స్థితిలో ఆహారం రుచించదు. ఆపైన ముఖకవళికలు మారిపోతాయి. గతంలో చిరునవ్వు చిందిస్తూ కనిపించిన వ్యక్తి ముఖం ఎన్నడూలేనంత గంభీరంగా మారుతుంది. దీనినే డాక్టర్లు ఫేషియల్ మాస్కింగ్ అంటారు. శరీరం కొద్దిగా వంగిపోతుంది. కదలికలు నెమ్మదిగా, బిగుతుగా మారతాయి. వ్యాధి ముదురుతుండటంతో చేతివేళ్లలో వణుకు మొదలవుతుంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీ చేయకుండా ఉన్న సమయంలో చేతి వేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదుసార్లు వణుకుతుంటాయి. అదే విధంగా చూపుడు వేలు, బొటన వేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి. చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవటం ఇబ్బందికరంగా మారుతుంది. ఈ పరిస్థితిలో వ్యక్తి తన అవయవాలపై అదుపు కోల్పోతున్నట్లు గుర్తించగలుగుతారు. ఈ రకమైన లక్షణాలు కనిపించిన వారిలో దాదాపు 70 శాతం మంది పార్కిన్సన్స్ ప్రారంభ దశలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి నిర్ధారణకు కచ్చితమైన పరీక్షలు అంటూ ఏమీ లేవు. ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, లక్షణాలను అడిగి తెలుసుకోవటం ద్వారా వ్యాధిని, దాని స్థాయిని అంచనా వేయాల్సి ఉంటుంది. అయితే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులోని ఇతర భాగాలకు ఏమైనా ప్రమాదం ఉందా అన్న అంశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్రెయిన్ స్కాన్, ఎం.ఆర్.ఐ. లాంటి నిర్ధారణ పరీక్షలు చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాలి.
వణుకుడు వ్యాధి చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేసి, వ్యాధిగ్రస్తుడు సాధారణ జీవితం గడిపేలా చేసే లక్ష్యంతోనే సాగుతుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి, శరీర తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చికిత్స వ్యూహాన్ని రూపొందించాలి. ఇందుకు మందులు, ఫిజియో థెరపీ, అవసరాన్ని బట్టి శస్త్ర చికిత్స సిఫారసు చేయాలి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కనిపెట్టిన ఎల్ డోపా అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేని పక్షంలో డోసేజ్ మొత్తంలో లోటుపాట్లు ఏమైనా జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సాయపడుతూ డోపమైన్ ఉత్పత్తి జరిగేటట్లు చేస్తుంది. దీంతో అవయవాలు బిగుసుకుపోవటం, వణుకుడు తగ్గుతుంది.
పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) కీలకమైన శస్త్రచికిత్స. ఇది వ్యాధి పెరుగుదలను నియంత్రిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచేందుకు పేస్ మేకర్ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎం.ఆర్.ఐ., సి.టి.స్కాన్ ద్వారా వ్యాధిగ్రస్తుడి మెదడులో సమస్య ఎక్కడుందో గుర్తిస్తారు. ఆపైన ఈ చిన్న ఎలక్ట్రోడ్ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బ్యాటరీ-తీగ ఉంటాయి. మెదడులోని కొన్ని కణాలను తొలగించటం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. డోపమైన్ తయారీ పునరుద్ధరించగలుగుతారు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇన్ఫెక్షన్లకు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స ద్వారా శరీరభాగాలను మెదడు తన అదుపులోకి తెచ్చుకోవటానికి తోడ్పడుతుంది. అయితే మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చాలా సున్నితమైనది. నిపుణులైన సర్జన్లు అత్యాధునిక పరికరాలు, వసతుల మధ్య నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి, డీబీఎస్ సర్జరీ చేయించుకోవలసి వచ్చిన రోగులు నాణ్యమైన, ఆధునిక చికిత్స అందుబాటులో ఉన్న ఆస్పత్రిని ఎంచుకోవడం తప్పనిసరి.