ఇతిహాసాల కాలం నుంచీ అంతే. వాళ్లంటే చిన్నచూపు. తరాలు మారుతున్నా వివక్ష పోవడం లేదు. హిజ్రాల జీవితం వెనుక ఎన్నో కన్నీటి కథలు. బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సమాజం అంటగట్టే ముద్ర ఒకటి. ఈ పరిస్థితుల మధ్య భిన్నమైన జీవన శైలిని ఎంచుకొన్నారు లతాదేవి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండాకు చెందిన నరేశ్ హిజ్రాగా మారాడు. లతాదేవిగా పేరు మార్చుకొన్నాడు. గ్రామంలో వివక్షను భరించలేక వేములవాడ మండలం అగ్రహారం తెట్టెకుంట సమీపంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నది లతాదేవి. పలకరిస్తే చాలు, చేయని తప్పులకు సమాజంలో చీత్కారాలను ఎదుర్కొనాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతుంది. సంక్షోభ సమయంలో తనకు తోడుగా నిలిచిన తల్లికి జీవితకాలం రుణపడి ఉంటానని అంటున్నది.
కష్టకాలంలో కొత్తదారి..
మొదట్లో లతాదేవి యాచన చేసేది. మొదటి విడత కరోనా కష్టకాలంలో ఎక్కడా యాచించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో, బతకడం కోసం ఎడతెగని తండ్లాట తప్పలేదు. తల్లి కూరగాయలు విక్రయిస్తూ పోగు చేసిన డబ్బు, తాను దాచుకొన్న సొమ్ముతో మూడు పాడి ఆవులను కొని, పాలు విక్రయిస్తూ జీవనం సాగించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి లతాదేవి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఆవులతోపాటు మేకలను, సీమ కోళ్లనూ పెంచుతున్నదిప్పుడు. హిజ్రాలంటేనే బెదిరించి డబ్బు లాక్కుంటారన్న ముద్ర నుంచి బయటపడి.. కొత్త ఉపాధి మార్గానికి దారులు వేసుకొన్నది.
పిలిస్తే పలుకుతాయి..
అగ్రహారం తెట్టెకుంట సమీపంలో చెరువును ఆనుకునే లతాదేవి నివాసం. ప్రకృతి తన ఇంటి ముందే కొలువుదీరిందా అన్నట్లు కనిపిస్తుంది ఆ వాతావరణం. ఎదురుగా గుట్టలు .. ఇంటిముందు చెరువు.. లతాదేవి ప్రకృతికి ప్రియ నేస్తంలా తోస్తుంది. తను పెంచుకుంటున్న మేకలకు పేర్లుంటాయి. లతాదేవి పిలిస్తే చాలు పరుగెత్తుకుని వస్తాయి. ఆవులైతే, కాసేపు లతాదేవి కనిపించకపోతే, ఆర్ద్రతతో ‘అంబా’ అని పిలుస్తాయి. ఇంటి ముందున్న చెరువులోని బాతులూ తన దోస్తులే. ‘సమాజంలోని మనుషులంతా వేరుచేసి చూసినా పశువులు మాత్రం ఎంతో ప్రేమగా నా జీవితంలో భాగమయ్యాయి’ అంటారు లత. ‘నేను ఎంచుకున్న జీవితమిది. ఎవరో ఏదో అనుకుంటారని ఆత్మవంచన చేసుకోలేను’ అని చెబుతారు ఆత్మవిశ్వాసంతో.
చింతల నగేష్ కుమార్