‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా కథ మొత్తం కల్పితమేనని.. ఇందులో ఎలాంటి చారిత్రక సంఘటనల్నీ ప్రస్తావించలేదని చెప్పారు దర్శకుడు రాజమౌళి. స్టార్ వాల్యూ కంటే కథలోని ఉద్వేగాలే సినిమాను పరుగుపెట్టిస్తాయని అన్నారాయన.ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందిన ఈ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్చరణ్,రాజమౌళి, అలియాభట్, నిర్మాత డీవీవీ దానయ్య శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఎన్టీఆర్: చరణ్తో నాకు చాలా కాలంగా స్నేహం ఉంది. లాక్డౌన్ సమయంలో కూడా తరచూ కలుసుకొని సినిమా గురించి మాట్లాడుకునేవాళ్లం.
రామ్చరణ్: తారక్తో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఏమైనా విభేదాలు, మనస్పర్ధలు వచ్చినా కూడా వాటిని దాటుకొని స్నేహాన్ని కాపాడుకునే దృఢమైన బంధం మాది. ఎలాంటి నటనలూ లేకుండా స్వచ్ఛమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్నాం. అందుకే తెరపై మా స్నేహబంధం అద్భుతంగా ఆవిష్కృతమైంది.
రాజమౌళి: తారక్, రామ్చరణ్ బైక్పై వచ్చే సన్నివేశాన్ని తొలిషాట్గా చిత్రీకరించాం. అప్పుడు వాళ్లు మాట్లాడుకున్న తీరు, సంభాషణలు పలికిన విధానం చూసి.. ఈ సినిమాలో ఇద్దరి మధ్య స్నేహం అద్భుతంగా పండుతుందనే నమ్మకం కలిగింది.
అలియాభట్: కరోనా వల్ల షూటింగ్కు అవాంతరాలు ఎదురైనా ఎప్పుడూ చలించలేదు. ఈ సినిమాను పూర్తి చేయడం గొప్ప బాధ్యతగా భావించా. రాజమౌళి వంటి దిగ్దర్శకుడి సినిమాలో నటించడం ఓ గౌరవం.
రాజమౌళి: ప్రపంచానికి వచ్చిన అతిపెద్ద కష్టం కరోనా. అందరం ఒక్కసారిగా ఆగిపోతే పెద్దగా భయం అనిపించదు. అయితే కరోనా వల్ల జరిగిన ప్రాణనష్టం మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది. ‘ఇప్పటివరకు పరుగెత్తింది చాలు. ఒక్కసారి ఆగి చూసుకొని ఆలోచించుకోండి..’అని ప్రకృతి హెచ్చరించినట్టు అనిపించింది. ఓ రకంగా లాక్డౌన్ నాకు మంచి చేసిందనే భావిస్తున్నా. కుటుంబంతో కావాల్సినంత సమయాన్ని ఆస్వాదించాను.
రామ్ చరణ్: సినిమాను ఏ జోష్తో మొదలు పెట్టామో అంతకు రెండింతల జోష్తో పూర్తిచేశాం. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవాలనే సంకల్పంతో అందరం కృషి చేశాం.
ఎన్టీఆర్: భూమ్మీదున్న ప్రతి జీవికి ఓ ఆశ ఉంటుంది. భవిష్యత్తు బాగుండాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటాం. ఆ నమ్మకమే మా అందరిని నడిపించింది. రాజమౌళిగారి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ శ్రమించారు.
ఎన్టీఆర్: ఆ సీన్లో కనిపించని టైగర్ రాజమౌళిగారే. ఆయనే అలా గర్జిస్తూ నా ముందుకొచ్చాడనుకున్నా. పరిచయమున్న పులి కాబట్టి నేను కూడా తిరిగి గట్టిగా అరిచాను (నవ్వుతూ).
ఎన్టీఆర్: నిజాంపై తిరుగుబాటు చేసి కొమరం భీమ్ వీరమరణం పొందినట్లు మనకు తెలుసు. అయితే ఆయన వ్యక్తిత్వపు లోతులు, ఆలోచనా విధానం, అడవిలో ఆయన జీవనశైలి గురించి చాలా మందికి తెలియదు. వాటిని రాజమౌళిగారు నాకు సమగ్రంగా వివరించారు. మానసిక, శారీరక దృక్కోణాల పరంగా కొమరం భీమ్ పాత్రను పోషించడం ఓ సవాలుగా అనిపించింది. రాజమౌళిగారి సహకారంతో కొమరం భీమ్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశానని అనుకుంటున్నా.
రాజమౌళి: ఓ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే విషయంలో నాకు స్పష్టత ఉంది. స్టార్వాల్యూ గురించి కూడా నాకు బాగా తెలుసు. అయితే స్టార్ ఇమేజ్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేటర్స్ వరకు మాత్రమే తీసుకొస్తుంది. ఒక్కసారి లైట్స్ ఆఫ్ అయ్యాక కథే సినిమాను నడిపిస్తుందన్న సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. తెరపై తారక్-చరణ్ మధ్య స్నేహబంధంతో ప్రేక్షకులు సహానుభూతి చెందితే, ఇక వారి వ్యక్తిగత ఇమేజ్ల గురించి పట్టించుకోరనే నమ్మకంతోనే ఈ సినిమాకు శ్రీకారం చుట్టాను.
రాజమౌళి: నేను చదివిన పుస్తకాలే నాలోని సృజనకు మూలకారణమని భావిస్తా. అమరచిత్ర కథలు, యండమూరి, యద్ధనపూడి సులోచనా రాణి నవలలు, ఇంగ్ల్లిష్ సాహిత్యం ..సృజనను పెంచుకునేందుకు ఇలా ఎన్నో దోహదపడ్డాయి. బాల్యం నుంచి నాకు విపరీతంగా పుస్తకాలు చదివే అలవాటు ఉంది.
రాజమౌళి: అలాంటిదేం లేదు. ఈ సినిమాలో చరణ్, తారక్ నటించడంతో రెండు ఆటంబాంబులు నాకు దొరికినట్లు ఫీల్ అయ్యాను. అల్లూరి, కొమరం భీమ్ పేర్లతో ఉన్న కథానాయకులు ‘నాటు నాటు..’ అనే పాటకు చిందులేయడం ఏంటనే కామెంట్స్ వస్తాయని ఊహించాం. అయితే ఆ పాటలో కూడా గొప్ప ఎమోషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి స్నేహబంధంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.
రామ్చరణ్: ఈ సినిమాలో నా పాత్ర మూడు షేడ్స్లో సాగుతుంది. మూడూ వేటికవే ప్రత్యేకంగా అనిపిస్తాయి. అవేమిటో తెరపై చూస్తేనే థ్రిల్ ఫీలవుతారు.
రాజమౌళి: ఈ సినిమా కథకు, చరిత్రకు ఎలాంటి సంబంధం లేదు. పూర్తి కాల్పనిక కథాంశమిది. చరిత్రకు సంబంధించిన సంఘటనల్ని ఇందులో అస్సలు చూపించలేదు. మూడేళ్ల పాటు కనిపించకుండా పోయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఆ సమయంలో ఏం చేశారనే ఊహ నుంచి ఈ కథ రాసుకున్నా. 95 శాతం కథ ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. కొమరం భీమ్, అల్లూరి బయోపిక్ తీసుంటే వాళ్ల చరిత్రల గురించి తప్పకుండా అధ్యయనం చేసేవాణ్ణి. ‘ఆర్ఆర్ఆర్’ కథ స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దేశభక్తి ఓ అంతర్లీనమైన అంశంగా ఉంటుంది.
రాజమౌళి: నా దగ్గర చాలా కథలున్నాయి. సినిమా తాలూకు ఐడియాస్ నా మైండ్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. కథలు అనుకోవడం కంటే, వాటిని తెరపై తీసుకురావడానికి జరిగే మథనమే ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది. కోరుకున్న అవుట్పుట్ కోసం నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని టార్చర్ పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు.. కథకు తగిన ఆర్టిస్టులు దొరకడం వల్ల అన్నీ సజావుగానే జరిగాయి.
–సినిమా డెస్క్