కరోనా జాడ లేకుండా జల్లెడ పట్టినం

- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
- తెల్ల రేషన్కార్డు లేని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ
సూర్యాపేట టౌన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి జాడ ఉమ్మడి జిల్లాలో ఉండకూడదనే ఎక్కడికక్కడ కట్టడిచేసి ఒకటికి రెండుసార్లు బాధితుల కాంటాక్ట్స్తోపాటు అనుమానితులను జల్లెడపట్టి తగు చర్యలు చేపట్టామని.. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందువల్లే కేసులు తగ్గుముఖం పట్టి ఒక్కొక్కరుగా కోలుకుంటూ డిశ్చార్జి అవుతున్నారన్నారు. ‘పేట’ పురపాలక సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో సేకరించిన బియ్యం, నిత్యావసర సరుకులను తెల్ల రేషన్కార్డు లేని సుమారు 600 మంది పేద కుటుంబాలకు గురువారం మంత్రి పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం, ఇతర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ అతి తక్కువ సమయంలో విస్తృతంగా వ్యాపించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అధికారులను అప్రమత్తం చేసి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో కొత్త కేసులు నమోదు కావడం లేదన్నారు.
ఇక విపక్ష నాయకుల మాటలకు హద్దూ అదుపులేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం కరోనా బారినుంచి కోలుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ప్రజలంతా ప్రభుత్వ చర్యలను కొనియాడుతుంటే వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరూ పస్తులుండొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, అందుకు పేద కుటుంబాలకు అండగా నిలువాలనే ఆయన ఆలోచనల మేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ముందస్తు జాగ్రత్తలే తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచాయని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రజలంతా విధిగా పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. అలాగే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి, కరోనా బారిన పడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
పురపాలక సంఘానికి రూ.లక్ష చేయూత..
కరోనా కట్టడిలో భాగంగా ‘పేట’ మున్సిపాలిటీకి జిల్లా కేంద్రానికి చెందిన విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ దవాఖాన యాజమాన్యం డాక్టర్ రామకృష్ణ- విజయలక్ష్మి దంపతులు రూ.లక్ష చెక్కును మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ప్రత్యేకాధికారి వేణుగోపాల్రెడ్డి, సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో జట్టు : రాందాస్ అథవలే
- తమిళనాడులో పసందుగా పొత్తుల రాజకీయం
- కొవిడ్-19 వ్యాక్సిన్ : ప్రైవేట్ దవాఖానలో ధర రూ. 250గా ఖరారు!
- దేశంలో కరోనా విస్తృతిపై కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
- మహారాష్ట్రలోని అమరావతిలో మార్చి 8 వరకు లాక్డౌన్
- ఉమెన్స్ డే సెలబ్రేషన్ కమిటీ నియామకం
- ఉల్లిపాయ టీతో ఉపయోగాలేంటో తెలుసా
- మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు
- న్యాయమూర్తులపై దాడులు, ట్రోలింగ్ విచారకరం : కేంద్ర న్యాయశాఖ మంత్రి
- వాణీదేవిని గెలిపించాల్సిన బాధ్యత అందరిది : మహమూద్ అలీ