15 నుంచి దేశవ్యాప్తంగా అమలు
బీఐఎస్ అనుమతి ఉంటేనే వ్యాపారం చేయాలి
బీఐఎస్ సైంటిస్ట్ సీహెచ్ విదీష
వరంగల్ చౌరస్తా, జూన్ 12: దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్ మార్క్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు బీఐఎస్ సైంటిస్ట్ సీహెచ్ విదీష అన్నారు. వరంగల్ గిర్మాజీపేటలో శనివారం బంగారు వ్యాపారులకు బీఐఎస్ హాల్ మార్క్ విధానంపై చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ ఇకపై దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు, ఆభరణాలు తయారు చేసేవారు తప్పనిసరిగా బీఐఎస్ అనుమతి కలిగి ఉండాలన్నారు. బీఐఎస్ అనుమతి లేకుండా బంగారం వ్యాపారం చేయొద్దన్నారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లావ్యాప్తంగా 50 మంది వ్యాపారులకు మాత్రమే బీఐఎస్ అనుమతి ఉందన్నారు. మిగిలిన వారు విధిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే వినియోగదారుల చట్టానికి మార్పులు చేశారన్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తూ..
హాల్ మార్క్ సెంటర్లో స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తూ అసెయింగ్ టెస్టులు చేయకుండా హాల్మార్క్ ముద్రలు వేస్తున్నారని, రసీదులు అందించకుండా ఎక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి అన్నారు. హాల్ మార్క్ సెంటర్ల లోగోలు ముద్రించకుండా వినియెగదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై వినియోగదారుల చట్టం ప్రకారం బీఐఎస్ మార్క్తో పాటు టెస్టింగ్ సెంటర్ లోగోలు సైతం ముద్రించాలన్నారు. వరంగల్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు దీటుగా బంగారు ఆభరణాలు అందించడానికి ప్రతి వ్యాపారి కృషి చేయాలని, వినియోగదారులకు నమ్మకంతో పాటు విశ్వసనీయతను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తోట హరీశ్, మండలి సంయుక్త కార్యదర్శి మేడిపల్లి సావిత్రి, శివకుమార్, నల్లా రాజేందర్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.