సగం కంటే ఎక్కువ మహిళలే
గతంతో పోలిస్తే పెరిగిన ప్రాతినిధ్యం
14మందే పాత వారు
వరంగల్, మే 4: గ్రేటర్ ఎన్నికల్లో కొత్తవాళ్లే ఎక్కువ గెలుపొందారు. 66డివిజన్లలో కేవలం 14 మినహా 52 మంది మొదటిసారి కౌన్సిల్లోకి అడుగుపెడుతున్నారు. అలాగే ఈ సారి కౌన్సిల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. రిజర్వేషన్ ప్రకారం 33మందికి అవకాశమివ్వగా జనరల్ స్థానాల నుం చి 37మంది కార్పొరేటర్లుగా విజయం సాధించడం విశేషం.
14మందిలో 8మంది మహిళలు
గతంలో కార్పొరేటర్గా పనిచేసి, తాజాగా గెలిచిన 14మందిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. సగం కంటే ఎక్కువ అంటే ఎనిమిది మంది మహిళలే ఉన్నారు. ఇందులో గుండు సుధారాణి 2005 నుంచి 2010 వరకు ఫ్లోర్లీడర్గా పనిచేయగా, ప్రస్తుతం 29వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అలాగే చీకటి శారద(8వ డివిజన్), తూర్పాటి సులోచన(14వ డివిజన్), ఓనీ స్వర్ణలత(19వ డివిజన్), కావేటి కవిత(12వ డివిజన్), రిజ్వానా షమీమ్(36వ డివిజన్), నల్లా స్వరూపారాణి(57వ డివిజన్) టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. గత కౌన్సిల్లో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన చాడ స్వాతి మళ్లీ 52వ డివిజన్ నుంచి గెలిచారు. ఇలా కార్పొరేటర్గా అనుభవం ఉన్న 8మంది మహిళలు కౌన్సిల్లో అడుగుపెడుతున్నారు. 7వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన వేముల శ్రీనివాస్, 51వ డివిజన్ నుంచి బోయినపల్లి రంజిత్రావు, 56వ డివిజన్ నుంచి సిరంగి సునీల్కుమార్ గత కౌన్సిల్లో కార్పొరేటర్లుగా ఉన్నారు. 20వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన గుండేటి నరేంద్రకుమార్, ఏఐఎఫ్బీ తరఫున 22వ డివిజన్ నుంచి గెలిచిన బస్వరాజు కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి 10వ డివిజన్ నుంచి గెలుపొందిన తోట వెంకటేశ్వర్లు గతంలో కార్పొరేటర్గా పనిచేశారు.
37మంది మహిళలే..
గ్రేటర్ కార్పొరేషన్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. 66 డివిజన్లలో 37మంది మహిళలు గెలుపొందారు. రిజర్వేషన్ ప్రకారం వారికి 33 సీట్లు కేటాయించగా టీఆర్ఎస్ జనరల్ స్థానాల్లోనూ మహిళలకు అవకాశం కల్పించా రు. దీంతో కౌన్సిల్లో పురుషుల కంటే మహిళల ప్రాతిని ధ్యం పెరిగింది. టీఆర్ఎస్ నుంచి 27మంది మహిళా కార్పొరేటర్లు ఉండగా, బీజేపీ నుంచి ఏడుగురు విజయం సాధించారు. కాంగ్రెస్నుంచి ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు.
మెజార్టీలో ‘తూర్పు’ రికార్డు
మెజార్టీలో వరంగల్ తూర్పు నియోజకవర్గం రికార్డు సృష్టించింది. 66 డివిజన్లలో అత్యధిక మెజార్టీతో పాటు అత్యల్ప మెజార్టీతో గెలిచిన ప్రాంతమూ ఇదే కావడం విశేషం. గతంలో ఇక్కడి అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో అత్యధిక మెజార్టీ నమోదు కాగా తాజా ఎన్నికల్లో ఆ రికార్డును కాపాడుకుంది.
అత్యధికం పల్లం పద్మ..
అత్యల్పం దిడ్డి కుమారస్వామి
ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తూర్పు నియోజకవర్గంలోని 32వ డివిజన్లో నమోదైంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లం పద్మ సమీప బీజేపీ అభ్యర్థిపై 4,411 ఓట్ల భారీ మెజార్టీలో విజయం సాధించారు. అలాగే 34వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి కుమారస్వామి బీజేపీ అభ్యర్థిపై కేవలం 11 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని 21వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేడిది రజిత 5,358 మెజార్టీ సాధించారు. ఈసారి ఈ ప్రాంతంలోని 32వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లం పద్మకు అత్యధిక మెజార్టీ రావడం విశేషం.