నర్సంపేట రూరల్, మే 15: పచ్చిరొట్ట పంట దిగుబడిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. భూసారం పెంపులో దిట్ట. భూముల్లో రేగడి మట్టి పోసేకంటే.. నేల స్వభావానికి అనుగుణంగా పచ్చిరొట్ట ఎరువు సాయంతో సారవంతంగా మార్చుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇందులో జీలుగ సాగు చక్కటి ఫలితాలు ఇస్తున్నది. నేల స్వభావాన్ని బట్టి జీలుగ సాగు చేసుకుంటే ఆపై వేసే పంటలకు అనుకూలంగా ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువుల కోసం నిర్దేశించిన మొక్కలను పొలంలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి మొక్కలకు సారవంతమైన భూమిని అందిస్తుంది. జీలుగ పూతదశకు రాగానే నేలలో కలియదున్నితే అత్యధిక పరిమాణాల్లో నేలకు పోషకాలు అందుతాయి. 30 కిలోల జీలుగ విత్తనాల బస్తాకు అసలు ధర రూ. 1,898 ఉండగా, 65 శాతం సబ్సిడీ పోగా, రూ. 665 చెల్లించి పొందొచ్చు. పచ్చిరొట్టె వల్ల భూమి సారవంతంగా మారుతుంది. పశువుల పేడకంటే పచ్చిరొట్ట పది రెట్లు భూమిని ఎక్కువ సారవంతం చేస్తుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. నత్రజని, భాస్వరం వాడకం కూడా తగ్గుతుందని, అంతేగాక నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని చెబుతున్నారు. పచ్చిరొట్ట అనుకున్న ఫలితాలు ఇస్తుండడంతో గ్రామాల్లో రైతులు ఈ పంట సాగుపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
నెల రోజుల పంట..
ఏకవర్షిక మొక్కల్లో ప్రథమ స్థానం జీలుగదే. మొక్కలు నాటిన 25 నుంచి 30 రోజుల్లోనే పంట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు అవసరం ఉంటుంది. దుక్కిలో 20 నుంచి 30 కిలోల యూరియా వేసి ఆపై విత్తనాలు చల్లుకోవాలి. బిందుసేద్యం ద్వారా అయితే సాళ్లల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. మొక్కలు బాగా పెరిగేందుకు క్రమపద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. 25 నుంచి 30 రోజులకు మొక్కలు ఏపుగా పెరిగి పూతదశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి, లేదా రోటోవేటర్ సహాయంతో కలియదున్నాలి. దున్నిన అనంతరం 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను దుక్కిలో వేయాలి. సూపర్ పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. కుళ్లే దశలో నీటిని సక్రమంగా అందించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట ఎరువులకు ముఖ్యంగా జీలుగ, జనుము, సీమ జీలుగ, పిల్లి పెసర, నీలి, అడవి నీలి(వెంపలి) వాటిని రైతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా ప్రాంతాల్లో రైతులు జీలుగ సాగుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
పచ్చి రొట్ట గుణగణాలు..
క్షార గుణం గల భూములు అంటే.. చౌడు భూములు, వరి పండించే భూముల్లో పచ్చిరొట్ట వేస్తారు. పూతదశలో కలియదున్నడం వల్ల ఎకరానికి 9 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.
పచ్చిరొట్ట సాగులో మెళకువలు..
ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి.
తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కి దున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి.
నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం.
రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని కలియ దున్నవచ్చు.
పసుపు, కంది పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట పెంచి పూత సమయంలో కలియ దున్నాలి.
లాభాలు అనేకం..
పొలంలో జీలుగను కలియదున్నిన తర్వాత అవి నేలకు, ఆపై వేసే పంటకు విశేషమైన లాభాలు అందిస్తుంది.
ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుంది.
మొక్కలకు 2 శాతం నత్రజని, సూపర్పాస్పేట్ను అదనంగా అందుతుంది.
జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.
నేలలో కరుగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి.
నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతుంది.
నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
లెగ్యూంజాతికి చెందిన మొక్క కావడంతో వేర్లల్లో నత్రజని స్థిరీకరణ అధికంగా ఉంటుంది.
తుంగ, గెరిక వంటి కలుపు మొక్కలను అడ్డుకుంటుంది.
నేల భౌతిక స్థితి (నేల ఆకృతి) మెరుగుపడి, భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.
నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి.
జీవ రసాయన చర్యల వల్ల నేల సారం పెరుగడమే కాక, నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకొని ఉత్పాదకత సామార్థ్యాన్ని పెంచుకుంటుంది.
నేలలో క్లిష్ట (లభ్యం కాని) రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి.
భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడుతాయి.
కలుపు మొక్కలు పెరుగకుండా నివారించవచ్చు.
జీలుగ, సీమ జీలుగ వంటి హరిత పైరులు వేసినప్పుడు వాటి వేళ్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను వెలికి తెచ్చి లభ్య రూపంలో పంటలకు అందిస్తాయి.
చౌడు భూముల పునరుద్ధరణకు ఉపయోగపడుతాయి.
భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.
సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేటట్లు చేస్తాయి.
పచ్చి రొట్ట పైర్లు ఎరువులు గానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడుతాయి.
పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది
పచ్చిరొట్టతో వ్యవసాయ భూమి సారవంతంగా తయారు అవుతుంది. గ్రామాల్లోని రైతులు పచ్చిరొట్ట సాగుసై దృష్టి సారించాలి. కలుపు మొక్కలను నివారించడానికి, భూసారం పెరగడానికి రైతులు విధిగా పచ్చిరొట్ట సాగు చేయాలి. పచ్చిరొట్ట వల్ల పశువుల పేడ కంటే పది రెట్లు ఎక్కువ భూమి సారవంతమై ఎరువుల వాడకం తగ్గుతుంది. పచ్చిరొట్ట ఎరువుతో గింజ గట్టిగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడుతుంది. రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో ఆరోగ్యకర ఉత్పత్తులను సాధించవచ్చు.
– తోట శ్రీనివాసరావు, ఏడీఏ, నర్సంపేట
అందుబాటులో జీలుగ విత్తనాలు
అన్ని గ్రామాల్లోని రైతులు పచ్చిరొట్ట సాగుపై ఆసక్తి చూపాలి. రైతులకు కావాల్సిన జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జీలుగ సాగుతో రైతులు సహజసిద్ధంగా భూసారాన్ని పెంచుకొని లబ్ధిపొందాలి. 65 శాతం సబ్సిడీతో 30 కిలోల జీలుగ విత్తనాలు రూ. 665లకే అందజేస్తున్నాం.
– కృష్ణకుమార్, ఏవో, నర్సంపేట