దేవుని గుట్ట జాతరకు వేళైంది. నేడు లక్ష్మీనృసింహుడి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై నిర్మితమైన పురాతన బుద్ధుడి ఆలయం 6వ శతాబ్దం నాటిదని తెలుస్తోంది. విగ్రహం లేని ఈ ఆలయాన్ని కొత్తూరు గ్రామస్తులు లక్ష్మీనర్సింహు డిగా భావిస్తూ 61 ఏళ్లుగా పూజలు చేస్తున్నారు. 2012లో ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని ప్రతి ష్ఠించి ఏటా కాముని పున్నానికి ముందు జాతరను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్స వాలకు సుమారు 8-10వేల మంది భక్తులు హాజరుకానున్నారు.
– ములుగు, మార్చి5(నమస్తేతెలంగాణ)
ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవుని గుట్టపై పురాతన బుద్ధుడి ఆలయం 6వ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. గుడి లోపల విగ్రహం లేకపోగా, గ్రామస్తులు లక్ష్మీనర్సింహస్వామి ఆలయంగా భావిస్తూ 61 ఏళ్లుగా పూజలు చేస్తున్నారు. 2012లో కీకార ణ్యంలో ఉన్న ఈ ఆలయంలో గ్రామస్తులు తాత్కాలికంగా లక్ష్మీనర్సింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఏటా కాముని పున్నం(హోలీ పండుగ)కు ముందు జాతరను నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా గుట్టపై ఉన్న ఈ ఆలయంపై గ్రామస్తులు నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి వర్షకాల ప్రారంభం(జూన్)లో పాలు, బియ్యం, బెల్లం తీసుకెళ్లి గుట్టపై వరదపాశం వండి, అక్కడే నల్లరాతి బండపై పోసి నాలుకతో నాకి పూజలు చేస్తారు. ఇలా వరదపాశం నాకడం వల్ల లక్ష్మీనర్సింహస్వామి కరుణించి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయని, ఎలాంటి కష్టాలు రావని ప్రజల విశ్వాసం. ఏటా నిర్వహించే ఈ జాతరకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సుమారు 8 వేల నుంచి 10 వేల మంది భక్తులు తరలిరానున్నారు.
నేటి నుంచి జాతర ప్రారంభం
దేవునిగుట్టపై నేటి నుంచి జాతర ప్రారంభం కానున్నది. సోమవారం లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణోత్సవం, 7వ తేదీన పూర్ణాహిత హోమం, మొక్కులు సమర్పించడంతో పాటు గుడి చుట్టూ బండ్లు తిరగడం కార్యక్రమాలు జరుగనున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు మంచి నీటి సౌకర్యంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రాశస్త్యం..
దేవుని గుట్టపై పురాతన బుద్ధుడి ఆలయం 6వ శతాబ్దం నాటిదని, ఇది అరుదైనదని చరిత్రకారులు గుర్తించారు. లేత ఎరుపు రంగు ఇసుక రాతి బండలతో చెక్కబడిన ఈ ఆలయం వెలు పల, బయట బుద్ధుడి విగ్రహాలతో పాటు ఆలయం వెనుక అర్ధనారీశ్వర విగ్రహం దర్శనమి స్తుంది. ఇది కీకారణ్యంలో సుమారు 3 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్కో బండపై శిల్పాన్ని చెక్కి, వాటిని పొందుపర్చి ఆలయాన్ని నిర్మించడం విశేషం. ఇలాంటి ఆలయాలు ఇండోనేషియా లోని బోరోబుదూర్ మహాయాన బౌద్ధ్దాలయం ఒకటి కాగా, మరొకటి కంబోడి యాలోని అంకోర్వాట్ దేవాలయం. అయితే ఈ రెంటింటికంటే కూడా కొత్తూరు గుట్టపై ఉన్న ఆలయం పురాతనమైనది. ఈ ఆలయం గుట్ట మీద పునాదులు లేకుండా 9 అడుగుల మందంతో రెండు పొరలుగా గోడలు నిర్మించిన తీరు అపూర్వం.
ఆలయానికి నలువైపులా రాతి గుండ్లతో పేర్చిన గోడ, ఉత్తరం వైపు సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు, ఒక మూలన పాలరాతి స్తంభం, ఆయక స్తంభానికి నలువైపులా అర్ధపద్మాలు.. సింహాలు చెకిన శిల్పాలు చూడ ముచ్చటైన ఆకృతితో ఉన్నాయి. తూర్పు ముఖంగా ఒకే చిన్న ద్వారం, దానికి ఇరువైపులా ద్వారపాలకుల వలె బౌద్ధమూర్తులు.. వారిలో ఒకరు హరివాహన లోకేశ్వరుడు. లోపలి గోడల మీద బౌద్ధ జాతక కథలతో చెకిన దృశ్యాలు.. రెండుమూడుచోట్ల బుద్ధుడు శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు.. ఒకచోట యుద్ధ సన్నివేశం.. దక్షిణం వైపు గోడపై అజంతా శిల్పాల్లోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు.. ఆచకొలువులో లలితాసనంతో కూర్చున్న దృశ్యం. పడమటి వైపు గోడపై అర్ధనారీశ్వర శిల్పం. దాని పై వరుసలో బుద్ధుడి బోధనలు వింటున్న రాజు, రాణులు, పరివారం, మిథునాలు. ఉత్తరం వైపు గోడపై పెద్ద తలకాయతో భయంకర ఆకారంలో బోధిసత్వుడు. ఇక్కడి శిల్పాలకు అజంతా, అమరావతి, ఫణిగిరి, నాగార్జున కొండ బౌద్ధ, ఒడిశాలోని సంధగిరి, ఉదయగిరి శిల్పాలతోనూ పోలికలు కనిపిస్తాయి.