నోరూరించే మామిడి కాయ పచ్చడి అంటే ఇష్టపడని వారు ఉండరు. చద్దన్నం, పెరుగన్నంలోకి ఇంత తొక్కు వేసుకుంటే ఆ మజాయే వేరు. లొట్టలేసుకుని తినాల్సిందే. ఎండాకాలంలో పచ్చడి పెట్టు నిల్వ చేసుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఏ ఇంట చూసినా పచ్చళ్ల ఘుమఘుమలే. అయితే, పుల్లని మామిడి కాయలతో తొక్కు పెట్టుకుంటే సంవత్సరమంతా పాడవకుండా ఉంటాయంటారు. కానీ, ఈసారి పచ్చడి కాయలకు డిమాండ్ బాగానే ఉంది. గాలివాన బీభత్సానికి మామిడి కాయలు రాలిపోయి మార్కెట్లో కొరత ఏర్పడింది. వ్యాపారులు ఒక్కో కాయను సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు.
నర్సంపేట రూరల్, మే 21 : తెలంగాణ పల్లెల్లో మామిడి కాయ పచ్చడి ప్రియంగా మారింది. ప్రస్తుతం పుల్లని కాయలకు డిమాండ్ ఉంది. హెచ్చు ధరలతో పచ్చడి పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వర్షాలకు ముందే మామిడి పచ్చడి (తొక్కు)ను తయారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సీజన్లో తొక్కు పెడితే సంవత్సరం పాటు తినొచ్చు. మార్కెట్లోకి రకరకాల మామిడికాయలు వస్తున్నాయి. గతంలో కేవలం దేశవాళి రకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు చాలా రకాల కాయలు లభ్యమవుతున్నాయి. ఏటా ఏప్రిల్ నెలలో మామిడి కాయల సీజన్ ప్రారంభమై జూన్ నెల చివరితో ముగుస్తుంది. గత సంవత్సరం పోల్చితే ఈ సారి మామిడి దిగుబడి తగ్గింది. గాలి దుమారం, వర్షాల ప్రభావం మామిడి తోటలపై ఎక్కువగా పడింది.
అంచుకు వేసుకుంటే ఆ మజాయే వేరు..
పల్లెల్లో నిత్యం వ్యవసాయ పనులు, కూలీలకు వెళ్లే ప్రజలు ఉదయమే కూర వండి తీసుకెళ్లడం కష్టమైన పనే. అందువల్ల చాలా మంది ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి నిల్వ చేసుకుంటారు. గ్రామాల సమీపంలోని వారాంతపు సంతలకు వెళ్లి పచ్చడి కాయలను కొనుగోలు చేసి చేస్తున్నారు. వాటిని తగినన్ని నీళ్లలో నానబెట్టి, ఆరిన తర్వాత ముక్కలుగా కోసి వెల్లుల్లి, నూనె, ఆవాలు, మెంతులు, పల్లీలు, కారం, ఉప్పు వంటి వాటితో పచ్చడిని రుచిగా తయారు చేసి జాడీల్లో నిల్వ చేస్తున్నారు. ఇలా నిల్వ చేయడం వల్ల బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు.
కాగా, ఈ తొక్కు కోసం ఉపయోగించే పుల్లని మామిడి కాయలు పల్లెల్లో దొరకడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతయ్యే మామిడి కాయలపైనే ఆధారపడాల్సి వస్తున్నది. పచ్చడి మామిడి కాయలను ఎంపిక చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాయలపై ఉండే తొక్క మందంగా ఉండి, కాయలు పులుపుగా ఉండేలా చూసుకోవాలి. కాయలో (పీచు) నారశాతం ఎక్కువ ఉంటే ముక్కలు మెత్తబడకుండా ఏడాదంతా పచ్చడి తాజాగా ఉంటుంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ కావడంతో ఇదే అదునుగా కొందరు వ్యాపారులు పుల్లటి కాయలకు బదులు తియ్యటి కాయలు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు.
తియ్యటి కాయలతో పచ్చడి పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉండదని, అందులో వినియోగించే నూనె, కారం, వెల్లుల్లి వంటి పదార్థాలు చేసిన వ్యయం నష్టపోతామని ప్రజలు చెబుతున్నారు. కాగా, ఈ సారి గాలి దుమారం, వానల ఎఫెక్ట్ మామిడి చెట్లపై పడింది. అక్కడక్కడా పల్లెల్లో, మామిడి తోటల్లో ఉన్న పుల్లని మామిడి చెట్లు ఎక్కువ కాత రాకపోవడం, వచ్చిన కాత మొత్తం రాలి పోవడం వల్ల కాయలకు కొరత ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో సైజును బట్టి ఒక్కో కాయకు రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు.