ఒకప్పుడు వేసవికాలం మొదలైం దంటే అడవిలో జల వనరులన్నీ ఎండిపోయి వన్యప్రాణులు అల్లాడేవి. నీళ్లు తాగేందుకు కొన్ని జంతువులు పాకాల సరస్సుకు దారిపడితే.. మరికొన్ని సమీప గ్రామాల వైపు వెళ్లేవి. ఇదే అదునుగా మాటువేసి ఉన్న వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ కంచెలకు బలయ్యేవి. ఏటా అడవి ప్రాణుల మనుగడ కష్టంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 86 కి.మీ.లు విస్తరించి ఉన్న పాకాల అభయారణ్యంలో తగినన్ని నీటి వసతులు కల్పించింది. ఎండాకాలంలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అడవి లోపలే చెక్డ్యాములు, సాసర్పిట్లు, చెలిమెలతో పాటు మినీ, మేజర్ పర్క్యులేషన్ పార్కులు, రాతికట్టడాలు నిర్మించి దప్పిక తీర్చుతున్నది. ఇలా రాష్ట్ర సర్కారు చర్యలతో తొమ్మిదేళ్లలో అడవంతా పచ్చబడి దట్టంగా మారి వన్యప్రాణుల సంఖ్య కూడా పెరుగుతున్నది.
– ఖానాపురం, మే 11
వేసవికాలం వచ్చిందంటే వన్యప్రాణుల మనుగడ కష్టంగా ఉంటుంది. అడవుల్లోని చిన్నచిన్న కుంటలు ఎండిపోయి దాహం తీర్చుకునేందుకు అడవిని దాటి నీటి వనరులు ఉన్నచోటకు వస్తుంటాయి. దీనిని ఆసరా చేసుకొని వేటగాళ్లు నీటి వనరులు ఉన్న చోట ఉచ్చులు పెట్టి, విద్యుత్ ప్రమాదాలకు గురిచేసి వన్యప్రాణులను హతమారుస్తుంటారు. దీంతో వన్యప్రాణుల సంఖ్య ఏటేటా తగ్గిపోయేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత తొమ్మిదేళ్లుగా అడవులు పచ్చబడి ఏపుగా పెరుగుతున్నాయి. అడవులు పెరగడంతో వన్యప్రాణుల సంఖ్య సైతం ఏటేటా పెరుగుతున్నది. పెరుగుతున్న వన్యసంపదను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దట్టమైన అడవులకు నిలయమైన పాకాల అభయారణ్యంలో వేసవిలో వన్యప్రాణులను వేటగాళ్ల బారిన పడకుండా కాపాడుతున్నది. చెక్డ్యాములు, సాసర్పిట్లు, మినీ పర్క్యులేషన్ పార్కులు, మేజర్ పర్క్యులేషన్ పార్కులు, రాతికట్టడాలు, చెలిమెలు నిర్మించి నీటి వసతులను కల్పిస్తున్నది.
పాకాల అభయారణ్యం వరంగల్, మహబుబాబాద్ జిల్లాల పరిధిలో 86 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాకాల అభయారణ్యం దట్టమైన అడవులకు నిలయంగా మారింది. దీంతో ఏటేటా వన్యసంపద పెరుగుతున్నది. ఇక్కడ అత్యధికంగా కొండగొర్రెలు, అడవి పందులతో పాటు కణుజులు, అడవి దున్నలు, మనుబోతులు, ఎలుగుబంట్లు, జింకలు సంచరిస్తున్నాయి. వీటితో పాటు కోతులు, కొండెంగలతో పాటు వివిధ రకాలైన పక్షులు ఉన్నాయి. గతంలో పాకాల అభయారణ్యంలో వేసివి కాలం వచ్చిందంటే నీటి వనరులన్నీ ఎండిపోయేయి. దీంతో వన్యప్రాణులు పాకాల సరస్సులో నీటిని తాగేందుకు వచ్చేవి. కొన్ని సందర్భాలలో సమీప అటవీ గ్రామాల్లోకి సైతం వన్యప్రాణులు వచ్చేవి. వీటిని ఆసరాగా చేసుకుని వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణులను హతమార్చేవారు. దీంతో విలువైన వన్యసంవద కనుమరుగయ్యేది. గత కొద్ది సంవత్సరాలుగా వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది.
పాకాల అభయారణ్యంలో వేసవికాలంలో వన్యప్రాణులు అడవిని దాటి బయటికి రాకుండా 9 చెక్డ్యాములు, 15 సాసర్ పిట్లు, 9 చిన్న నీటి కుంటలు, 2 పెద్ద నీటి కుంటలు, 100 రాతికట్టడాలు, 2 చెలిమెలు నిర్మించారు. అలాగే గడ్డి మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగి వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా ముందస్తుగా ఫైర్లైన్లను ఏర్పాటుచేశారు. నీటి వసతులు ఉన్నచోట అటవీ సిబ్బంది ప్రతినిత్యం ట్యాంకర్తో నీటిని నింపుతున్నారు. నీటి వసతి ఏర్పాటుచేసిన ప్రదేశాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో కెమెరా ట్రాప్లు అమర్చింది. దీని వల్ల వేటగాళ్లు సైతం అడవుల్లోకి వచ్చేందుకు వణికిపోతున్నారు. అటవీ శాఖ చేపడుతున్న చర్యలతో పాకాల అభయారణ్యంలో ఏటా వన్యప్రాణుల సంఖ్య పెరగుతున్నది. అడవులు దట్టంగా ఉంటేనే పులులు సంచరిస్తాయి. ఇటీవలి కాలంలో పాకాల అభయారణ్యంలోకి పెద్దపులి మూడు సార్లు వచ్చి వెళ్లడం విశేషం.
వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను కాపాడుకునేందుకు సమీప అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ‘వన్యప్రాణుల చట్టం-1972’ గురించి వివరిస్తున్నాం. వన్యప్రాణులను చంపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో వారికి చెబుతున్నాం. అలాగే అటవీ సిబ్బందితో ప్రతినిత్యం పెట్రోలింగ్ చేస్తున్నాం. పటిష్ట చర్యలు చేపట్టడంతో వన్యప్రాణులను కాపాడుకోగలుగుతున్నాం. వన్యప్రాణులు తాగునీటికి ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత.
– బిల్లిడి రమేశ్, ఎఫ్ఆర్వో, నర్సంపేట