నమస్తే తెలంగాణ నెట్వర్క్: మహా శివరాత్రిని పురస్కరించుకొని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం శివనామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే భక్తులతో శివాలయాలు కిక్కిరిసిపోయాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. జాగరణ ఉన్న భక్తుల కోసం నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ దేశాయిపేట సాయిధాం ఆవరణలో ఉన్న కైలాసగిరి శివాలయంతోపాటు కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి, భక్తమార్కేండేయ ఆలయం, ఓరుగల్లు కోటలోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయాల్లో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ ములుగురోడ్డులోని సప్తధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. పర్వతగిరి మండలకేంద్రంలోని పర్వతాల శివాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉషా దంపతులతోపాటు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ రుద్రాభిషేకాలు నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, గట్టు మహేశ్బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కేంద్ర పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జాన్వత్శర్మ, సీపీ అంబర్ కిశోర్ఝా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
సాయంత్రం 6:50 గంటలకు రుద్రేశ్వరి-రుద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వద్దిరాజు వెంకటేశ్వర్లు పట్టువస్ర్తాలు అందజేశారు. దేవాదాయశాఖ ఏసీ రాముల సునీత, సంజీవరెడ్డి, ఈవో వెంకటయ్య ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు నాగిళ్ల షణ్ముఖశర్మ, మణికంఠశర్మ, పెండ్యాల సందీప్శర్మ, పెండ్యాల సందీప్శర్మ, ప్రణవ్ పూజలు నిర్వహించారు. కాగా, భక్తులు అధిక సంఖ్యలో వీఐపీ క్యూలైన్లో వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు సైతం చేతులెత్తేశారని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నడికూడ మండలం వరికోల్ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. వేలేరు మండలం గట్టుమల్లన్న స్వామి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కమలాపూర్ మండలంలో శివాలయాలను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దర్శించుకున్నారు. భీమదేవరపల్లి మండలం ముత్తారంలోని అతి ప్రాచీన త్రికూటాలయం, వంగరలోని కైలాస క్షేత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూజలు చేశారు. సంగెంలోని సంగమేశ్వరాలయంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు పూజలు చేశారు.పుల
ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం శివనామస్మరణతో పులకించిపోయింది. మల్లికార్జునస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. ఒగ్గుపూజరులు పెద్ద పట్నం వేశారు. ఈవో నాగేశ్వర్రావు, డీసీపీ రవీందర్, ఏసీపీ పాల్గొన్నారు.
మడికొండ మెట్టుగుట్ట దేవస్థానం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. రాత్రి శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మొదటి అడిషనల్ జూనియర్ జడ్జి స్రవంతి, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంధ్యారాణి అభిషేకం నిర్వహించారు. కాగా, మెట్టుగుట్టకు వచ్చిన భక్తులు నిలు వు దోపిడీకి గురవుతున్నామని పలువురు ఆరోపించారు. పార్కింగ్ మొదలు ప్రతీది అధిక రేట్లు వసూలు చేయడంతో భక్తులు తీవ్రంగా మండిపడ్డారు. కారు పార్కింగ్ రూ.100, బైక్ రూ.50, కొబ్బరికాయలు, ప్రసాదంపై రూ.10 నుంచి రూ.15 పెంచి విక్రయిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమకొండ, మార్చి 8 : మహా శివరాత్రి సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం అలరించింది. ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్రెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం 6గంటలకు ప్రారంభమైన వేడుకల్లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధామనోహర్దాస్ ప్రసంగించారు. సినీగాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాటలు ఉర్రూతలూగించాయి. రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. సాంస్కృతిక రంగంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, జోరిక రమేశ్ పాల్గొన్నారు.