పాలకుర్తి రూరల్, ఆగస్టు 10: మండలంలోని దర్థేపల్లి గ్రామంలో జరిగే దండెమ్మ బోనాల పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. హైదరాబాద్లోని బోనాల తర్వాత అంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. పవిత్ర శ్రావణమాసంలో నిర్వహించే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచే మహిళలు తల్లుల సేవలో మునిగిపోతారు. అనంతరం దండెమ్మ తల్లికి నైవేద్యం, వస్ర్తాలతో మొక్కులు చెల్లిస్తారు. గత ఏడాది కరోనాతో పండుగను ఘనంగా నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈసారి వేడుకలను ఘనంగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలకనుగుణంగా భక్తులు మాస్కులు ధరించి రావాలని పిలుపునిచ్చింది.
అమ్మవారికి రెండు కొంగుల చీర
దండెమ్మ తల్లికి రెండు కొంగుల చీర సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా తల్లులకు రెండు కొంగుల చీర నేయరు. దండి దేవరను దండెమ్మగా పిలుచుకుంటారు. అమ్మవారికి ఒక్క రోజులోనే రెండు కొంగుల చీర నేస్తారు. పద్మశాలీలు పండుగ రోజు ఉదయాన్నే బండి మీద మగ్గం ఏర్పాటు చేసుకుంటారు. డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని విధులన్నీ తిరుగుతూ అమ్మవారి ఆలయం చేరేలోపు చీర నేస్తారు. సాయంత్రం 4 గంటలకు మేక పోతుల బండి గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఎడ్ల బండ్ల జాతర మొదలవుతుంది. రాత్రి వేళ ప్రధాన వీధుల గుండా శివసత్తుల పునకాలు డప్పు చప్పుళ్లు పోతరాజుల విన్యాసాల మధ్య ఆడపడుచులు బోనాలతో తరలివస్తారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని సర్పంచ్ ఇమ్మడి ప్రకాశ్, ఎంపీటీసీ మంద వీరలక్ష్మిసోమయ్య తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వారు పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో గుడిని అభివృద్ధి చేశామన్నారు.
అమ్మవారిని దర్శించుకోనున్న మంత్రి ఎర్రబెల్లి
వైభవంగా జరిగే దండెమ్మ తల్లి బోనాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్కుమార్ మం గళవారం ఒక ప్రకటన చేశారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన పేర్కొన్నారు.