స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 26 : పత్తి, పొగాకు, మిర్చి, వరి.. ఇవన్నీ సంప్రదాయ పంటలు. వీటికి పెట్టుబడితో పాటు చీడపీడల బెడదా ఎక్కువే. ఈ నేపథ్యంలో రైతులకు ఆయిల్పాల్ ఆశాకిరణంలా మారింది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దాదాపు 30ఏళ్ల పాటు నిశ్చింతగా ఆదాయాన్నిస్తుంది. ఈ పంట సాగుపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు పెడుతుండడంతో అన్నదాతల్లో ఆసక్తి పెరుగుతున్నది. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తుండడంతో జిల్లా రైతులు ఈ పంట సాగువైపు మొగ్గుతున్నారు. హెక్టారుకు రూ.12వేలు రాయితీ వస్తుండడం, పంట నిర్వహణకు ప్రభుత్వమే నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.5వేలు చొప్పున అందిస్తుండడం, అంతర పంటలకు సైతం ఏడాదికి రూ.5వేల చొప్పున ఇస్తుండడంతో రైతన్నలు ఆయిల్పామ్పై ఆశలు పెంచుకున్నారు. జనగామ జిల్లాలో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 400 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలనే లక్ష్యంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయిల్పామ్ సాగు కోసం 1272 ఎకరాలను గుర్తించారు. ఇప్పటివరకు 80 ఎకరాల్లో మొక్కలు నాటగా, మరో నెలలో 100 ఎకరాల్లో మొక్కలు నాటి డిసెంబరు వరకు లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.
అనుకూలతలు ఏవంటే..!
నేలల యోగ్యత : నీరు నిల్వ ఉండని నేలలతో పాటు, ఎర్ర నేలలు ఆయిల్పామ్ సాగుకు అనుకూలం. భూమిలో పీహెచ్ 8.2 కంటే తక్కువ ఉన్న నేలలు యోగ్యమైనవి. నల్ల రేగడి, చౌడు భూముల్లో పీహెచ్ పరీక్షలు చేసి, సాగుకు అనుకూలంగా ఉన్నాయని నివేదిక వస్తేనే సాగు చేయాలి.
నీటి వసతి : ఈ పంటకు ఏడాది పాటూ నీటి అవసరం ఉంటుంది. ప్రతి మొక్కకు వానకాలంలో రోజుకు 100 నుంచి 150 లీటర్లు, చలికాలంలో 170 నుంచి 210 లీటర్లు, ఎండకాలంలో 300 నుంచి 350 లీటర్ల నీరు కావాలి. సాగుకు నీరు సరిపోకపోతే మగ గెలలు ఎక్కువగా వచ్చి పంట దిగుబడి రాదు. ఎకరం వరిసాగుకు కావాల్సిన నీటితో ఐదు ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయొచ్చు.
ఎరువులు : ఆయిల్పామ్ సాగులో నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, బోరాన్లను మాత్రమే ప్రతి మూడు నెలలకు ఒకసారి వాడాల్సి ఉంటుంది. వీటిని కూడా ప్రభుత్వం రాయితీపై ఇస్తుంది.
దిగుబడి : మొక్కలు నాటిన తర్వాత నాలుగేళ్ల నుంచి పంట చేతికి రావడం మొదలవుతుంది. నాలుగో సంవత్సరంలో 4 నుంచి 5 టన్నులు, ఐదో సంవత్సరంలో 5 నుంచి 6 టన్నులు, ఆరో సంవత్సరంలో 6 నుంచి 8 టన్నులు , ఆరో సంవత్సరం నుంచి పది సంవత్సరాలకు పైగా 14 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. టన్నుకు ప్రతి నెలా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధర ఉంటుంది.
మొదలైన సాగు
జనగామ నియోజకవర్గంలోని వడ్లకొండలో 14.9 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు మొదలైంది.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని తాటికొండలో రైతులు బేతి రాజారెడ్డి, శ్రీధర్రెడ్డి, సుమన ముగ్గురూ కలిపి 22 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.చిల్పూర్ మండల కేంద్రంలో అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజ సదరాం వ్యవసాయ క్షేత్రంలో ఐదెకరాలు, పాలకుర్తి నియోజకవర్గం ముత్తారంలో 35.36 ఎకరాలు, ఫతేషాపూర్లో మూడు ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.
రాయితీలతో ప్రోత్సాహం
రైతులు ఆయిల్పామ్ సాగు చేసేందుకు ప్రభుత్వం రాయితీతో ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో క్లస్టర్ల వారీగా ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. దీర్ఘకాలిక వ్యూహంతో ఈ పంట సాగులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి.
అనుకూలమైన నేలల్లోనే సాగు
ఆయిల్పామ్ సాగు చేయాలనుకునే రైతుల భూమిలో పీహెచ్ (ఉదజని సూచిక) పరీక్షలు నిర్వహిస్తాం. అనుకూలతలు ఉన్నాయని నిర్ధారణ అయితేనే సాగుకు అంగీకరిస్తాం. డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాకే మొక్కలు అందిస్తాం. ఒక మొక్క రూ.117 కాగా, రాయితీపోనూ రూ.33కే ఇస్తున్నాం. డ్రిప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీలు జీఎస్టీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. బీసీలు పదిశాతంతోపాటు జీఎస్టీ, ఓసీలు 20శాతంతో పాటు జీఎస్టీ చెల్లించాలి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
కార్పొరేట్ ఉద్యోగిలా ఆదాయం
కనీసం ఐదెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్న ఎంతోమంది రైతులు కార్పొరేట్ ఉద్యోగిలా ప్రతినెలా ఆదాయం పొందుతున్నారు. తెలంగాణకు కావాల్సినంత ఆయిల్ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఆయిల్పామ్ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పని ఉండొద్దనే సీఎం కేసీఆర్ దీన్ని సాగు చేసే రైతులను ప్రోత్సహిస్తున్నారు.
ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ
అన్ని పంటల కంటే ఆయిల్పామ్ సాగులో ఖర్చు చాలా తక్కువ. దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. ఆంధ్రాలో నా స్నేహితుడు 50 ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగు చేస్తున్నాడు. నేను కూడా వరి బదులు ఆరెకరాల్లో ఆయిల్పామ్ వేస్తున్నా. ఇందులో మొదటిసారి పెట్టుబడి ఖర్చు తప్ప మరే ఖర్చులు ఉండవు. లేబర్ ఖర్చులు కూడా ఉండవు. ఆయిల్ పామ్ పంట చుట్టూ శ్రీగంధం, కొబ్బరి చెట్లు పెడుతున్నా. అంతర పంటగా పుచ్చ, పల్లి వేయాలనుకుంటున్నా.
ఎకరానికి నెలకు రూ. పదివేల ఆదాయం
ఆయిల్పామ్ పంట వేసిన నాలుగేళ్ల తర్వాత చేతికి వస్తుంది. ఐదెకరాల్లో సాగు చేస్తే నెలకు రూ. పదివేల చొప్పు న ఆదాయం పొందొచ్చు. ఎలాంటి పురుగు మందుల అవసరం లేదు. అంతర పంటలతోనూ అదనంగా ఆదాయం వస్తుం ది. ఒక్క మొక్క 30 ఏళ్లపాటు బతుకుతుంది. ఒక్కో చెట్టు 20 గెలలు వేస్తుంది. ప్రతి గెల 20 కిలోల బరువు ఉంటుంది. ఇలా ఐదు ఎకరాల్లో 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. లక్షా 90వేల ఆదాయం వస్తే రూ.30వేలు మాత్రమే ఖర్చవుతాయి. – వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్