తెలంగాణ రాష్ట్ర సమితికి జిల్లా సారథులు వచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులను బుధవారం నియమించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ చీఫవిప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అరూరి రమేశ్ నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలిగా ఎంపీ కవితను, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అధ్యక్షురాలిగా నియమించారు. జనగామ జిల్లా బాధ్యతలను జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి, ములుగు జిల్లా బాధ్యతలను జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్కు అప్పగించారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతున్నది. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో రెండు చోట్ల మహిళలను పార్టీ చీఫ్గా నియమించారు. రెండు జిల్లాల్లో బీసీలకు, రెండు జిల్లాల్లో ఓసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కో జిల్లాలో పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ అవకాశం కల్పించారు. అనుభవం, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటన, ఇతర కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిధులనే పార్టీ అధ్యక్షులుగా నియమించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్భాస్కర్ గతంలో వరంగల్ నగర పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. అదే అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మళ్లీ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా అకాశం ఇచ్చారు. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే అరూరి రమేశ్ అనుభవాన్ని పార్టీకి వినియోగించుకునే ఉద్దేశంతో వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా అక్కడి ఎంపీ మాలోత్ కవితను నియమించారు. గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా ఉన్న కవితకు అవకాశం ఇవ్వడంతో ఆ జిల్లాలోని అత్యధిక జానాభాకు మరోసారి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఏడాదిగా ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. తాజాగా జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల ప్రారంభం త్వరలోనే జరుగనున్నదని తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
వరంగల్, జనవరి 26(నమస్తేతెలంగాణ): ఎమ్మెల్యే అరూరి రమేశ్ టీఆర్ఎస్ వరంగల్ జిల్లా తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత గత పదేళ్లలో అనేక విజయాలను సొం తం చేసున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వార్ వన్సైడ్ చేశారు. 2012లో టీఆర్ఎస్లో చేరిన అరూరి రమేశ్ 2013లో వర్ధన్నపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందడంలో కీలక పాత్ర వహించారు. అనంతరం రమేశ్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచి ఘనవిజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తొలిసారి ఇక్కడి నుంచి 2014లో శాసనసభకు పోటీ చేసి మొదటి ఎన్నికల్లోనే 86,349 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత ఇదే ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలోనూ ర మేశ్ ముందు నిలిచారు. రెం డోసారి 2018లో అరూరి ఇదే స్థానం నుంచి ఎమ్మె ల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి రాష్ట్రంలోనే భారీ మెజారిటీ తో గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో రెండో స్థానం కైవసం చేసుకున్నారు. ప్రత్యర్థిపై 99,240 ఓట్ల ఆధిక్యం సాధించారు. అనంతరం 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 90శాతం పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందడం, అదే ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థా నాలను టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడం ద్వారా అరూరి రమేశ్ తన విజయాల పరంపర కొనసాగించారు. 2020 జనవరిలో సహకార సం ఘాలకు జరిగిన ఎన్నికల్లో కూడా వర్ధన్నపేట ని యోజకవర్గంలో 11 సంఘాలను టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకొనేలా ప్లాన్ చేసి సక్సెస్ అ య్యారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించేందుకు కార్యచరణ అమలు చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ వరంగల్ జిల్లా మొదటి అధ్యక్షుడిగా నియామకమైన అరూరి రమేశ్కు పార్టీలోని ప్రజాప్రతినిధులు, ము ఖ్యనేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. రమేశ్ హైదరాబాద్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా కవిత
మహబూబాబాద్, జనవరి26 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎంపీ మాలోత్ కవిత నియామకమయ్యారు. గిరిజన జిల్లాగా పేరున్న మానుకోటకు పార్టీ అధ్యక్షురాలిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడంతో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2009లో రాజకీయాల్లో కి వచ్చిన కవిత మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 టీఆర్ఎస్లో చేరి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2019 మేలో ఎంపీగా గెలుపొందారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గండ్రజ్యోతి
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26 ( నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ జయశం కర్ భూపాలపల్లి జిల్లా ప్రథమ అధ్యక్షురాలిగా గండ్ర జ్యోతి నియామకమయ్యారు. ప్రస్తుతం ఆమె వరంగల్ జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి జ్యోతిది మొదటి నుంచీ రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆమెకు రాజకీయాలపై పూర్తి పట్టు, అవగాహన ఉందని భావించిన కేసీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. 1970 జూన్ 3న హ నుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో జన్మించిన జ్యోతి 2004 నుంచి 2018 వరకు కాంగ్రెస్లో కొనసాగారు. 2019లో శాయంపేట మండలం నుంచి జడ్పీటీసీ గా గెలుపొందారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కాగా, జిల్లా పునర్వి భజనలో భాగంగా ప్రస్తుతం శాయంపేట మండలం హన్మకొండ జిల్లాలో భాగం కాగా, శాయంపేట మండలం మాత్రం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంది.