న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాత వాహనాల స్క్రాపేజీ పాలసీ అమలులోకి తేవడం వల్ల 35 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నది. తాజాగా ఆటోమొబైల్ రంగంలోకి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని విశ్వసిస్తున్నది కేంద్రం. అలాగే ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవర్ రూ.7.2 లక్షల కోట్లకు చేరుతుందని భావిస్తున్నది.
ఇదిలా ఉంటే, స్క్రాపింగ్ వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించడానికి సరిపడా వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత రవాణా మంత్రిత్వశాఖదే. స్ర్కాపేజీ వెహికల్గా గుర్తించడంతోపాటు స్క్రాపేజీ సర్టిఫికెట్ జారీ చేసి.. అది సంబంధిత వాహనదారు కొత్త వాహనం కొనుగోలుకు సమర్పించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత చట్టం ప్రకారం 2024 జూన్ ఒకటో తేదీ నుంచి 20 ఏండ్లకు పైగా నడిచిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేస్తారు. వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఆపివేస్తారు. రోడ్ టాక్స్లపై మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. వాహనాల విక్రయంపై వచ్చే జీఎస్టీని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.
అదే సమయంలో ఆటోమొబైల్ సంస్థలకు స్క్రాపేజీ వాహనాల స్థానే కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి ఐదు శాతం రాయితీ కల్పించాలని నితిన్ గడ్కరీ సలహా ఇచ్చారు. అధికారిక అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 51 లక్షల తేలికపాటి మోటారు వాహనాలు 20 ఏండ్లు దాటినవి కాగా, 15 ఏండ్లు దాటిన పాత వాహనాలు 34 లక్షల వాహనాలు ఉన్నాయని తెలుస్తున్నది. మరో 17 లక్షల మధ్య శ్రేణి, భారీ వాహనాలు 15 ఏండ్లు దాటినవి ఉన్నాయి. వీటికి ఇక ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశాల్లేవని అధికార వర్గాలు చెబుతున్నారు.