వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది. నలుగురు యాత్రికులతో మూడు రోజుల క్రితం అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సుల్’ సురక్షితంగా భూమికి చేరింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఫ్లోరిడాలోని సముద్రంలో దిగింది. గంట తర్వాత యాత్రికులు అందులో నుంచి చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చారు. దీనిని స్పేస్ ఎక్స్ యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ రీసెర్చ్ హాస్పిటల్ వైద్యాధికారిణి హేలీ ఆర్సెనాక్స్ (29), టీవీ నటి సియాన్ ప్రోక్టర్ (51), ఏరోస్పేస్ డేటా ఇంజినీర్ క్రిస్ సెంబ్రోస్కీ (42), జారెడ్ ఐజాక్మన్ (38) స్పేస్ ఎక్స్ వాహక నౌక డ్రాగన్ ‘స్పేస్ క్యాప్సూల్’ ద్వారా బుధవారం రాత్రి ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లారు. ‘ఇన్స్పిరేషన్-4’ అనే ఈ మిషన్లో భాగంగా 540 కిలో మీటర్ల ఎత్తులో.. మూడు రోజుల పాటు గడిపారు. స్పేస్ ఎక్స్ నిర్వహించిన మొదటి ప్రైవేటు రైడ్ ఇదే కావడం గమనార్హం.