హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కొత్తగా మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. ఇందుకోసం భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ, రోడ్లు, భవనాల శాఖల అధికారులకు నిర్దేశించింది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాల్టీ దవాఖానల నిర్మాణంపైనా క్యాబినెట్ సమీక్షించింది. అత్యంత వేగంగా ఈ నాలుగు దవాఖానల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ, కొవిడ్ కట్టడి, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న కరోనా స్థితిగతులు.. రాష్ట్రంలో తీసుకొంటున్న చర్యలపై వైద్యాధికారులు క్యాబినెట్కు సమాచారం అందించారు. పొరుగు రాష్ర్టాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రి అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకొన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితుల గురించి అధికారులు వివరించారు. విద్యాసంస్థలు తెరిచిన తర్వాత కరోనా కేసులలో పెరుగుదల లేదని, రాష్ట్రంలో కొవిడ్ పూ ర్తిగా అదుపులోనే ఉన్నదని పేర్కొన్నారు.
స్పెషల్ టీకా డ్రైవ్ ప్రారంభం
రాష్ట్రంలో 2,00,56,159 డోసుల మేర టీకాలు అందించామని, ఇందులో 1,45,19,909 మందికి మొదటి డోసు, 55,36,250 మందికి రెండు డోసులు ఇచ్చినట్టు అధికారులు మంత్రివర్గానికి నివేదించారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురువారం ప్రారంభమైందన్నారు. పంచాయతీ, మున్సిపల్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని క్యాబినెట్ నిర్దేశించింది. మం త్రులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రోజూ 3లక్షల టీకాలు వేసేలా సన్నద్ధతతో వ్యవహరించాలని ఆదేశించింది.
ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలి
రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 550 మెట్రిక్ టన్నులకు పెంచాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 130 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమే ఉండేదని, ఇప్పటివరకు 280 మెట్రిక్ టన్నులకు పెంచుకొన్నామని.. ఈ సామర్థ్యం 550 మెట్రిక్ టన్నులకు పెరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది. చిన్న పిల్లలకు కరోనా సోకితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు క్యాబినెట్కు తెలిపారు. రూ.133 కోట్ల ఖర్చుతో 5,200 బెడ్లు, మందులు, ఇతర సామగ్రిని, ముందస్తుగా సమకూర్చుకొన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆరోగ్య మౌలికవసతుల పురోభివృద్ధికోసం సమగ్ర ప్రణాళికను తదుపరి సమావేశానికి తీసుకొనిరావాలని రాష్ట్ర క్యాబినెట్ ఆదేశించింది.