హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విధానాలు, వాటి అమలు పారదర్శకంగా ఉన్నాయని అస్సాం వాణిజ్య పన్నులశాఖ ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల విభాగం తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు అస్సాం అధికారుల బృందం శనివారం హైదరాబాద్ చేరుకొని బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో సమావేశమైంది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖలో తీసుకొచ్చిన మార్పులు, నూతన సంస్కరణలను సీఎస్ వివరించారు. పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని, వ్యవస్థీకృత ఆధారిత పన్ను అమలుపై దృష్టి సారించినట్టు చెప్పారు. మ్యాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్లకు స్వస్తి చెప్పామని, శాఖాపరంగా కొత్త యాప్లు, మాడ్యూల్స్ను అభివృద్ధి చేశామని అన్నారు. కొత్త సరిళ్ల ఏర్పాటు ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించామని, పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెడుతామని అస్సాం అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూకుమారిప్రసాద్, అదనపు కమిషనర్ సాయికిశోర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.