హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పరీక్షలంటేనే చాలామంది విద్యార్థులు హడలెత్తిపోతారు. ఏ ప్రశ్నలు అడుగుతా రో? ఏం రాయాలో? అంటూ కంగారుపడుతారు. దానిబదులు పుస్తకాలు ముందుపెట్టుకొని వాటిని చూస్తూ పరీక్షలు రాస్తే ఎంత బాగుంటుంది! ఈ అవకాశాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు దక్కించుకోనున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు పుస్తకాలు చూసి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించాలని ఇటీవలే సాంకేతిక విద్యామండలి అధికారులు నిర్ణయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఓపెన్బుక్ విధానాన్ని అమలుచేయబోతున్నారు. ఐదేండ్లకోసారి పాలిటెక్నిక్ సిలబస్ మారుతూ ఉంటుంది. దీంతో విద్యార్థులు పాస్ కాలేకపోతున్నారు. బ్యాక్లాగ్ సబ్జెక్ట్ల పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నది. దీంతో ఓపెన్ బుక్ విధానాన్ని తేవాలని నిర్ణయించారు. మన దగ్గర టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఓపెన్ బుక్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పుస్తకాలు చూసి పరీక్ష రాసే అవకాశం ఉన్నది. ఇదే తరహాలో పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా పరీక్షలు రాయనున్నారు.