యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తు బ్రహ్మ నిర్ణయించిన సుముహూర్తాన.. వేదమంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాలు, కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగళ్యధారణ మహోన్నతంగా జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ నామస్మరణ మిన్నంటిన శుభవేళ.. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకై భక్తజనం పోటెత్తిన సమయాన.. జగత్ కల్యాణం అందరినీ ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. ఈ అపూర్వ ఘట్టం భక్తకోటి హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. యాదగిరిగుట్ట పులకించింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చింది మొదలు జరిగిన ప్రతీ ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది.
కనుల పండువగా పరిణయోత్సవం
ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం జరుగుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహస్వామి వారి పరిణయోత్సవం కనుల పండువగా సాగింది. కొండపైన తూర్పు మాడ వీధుల్లో ఆగ్నేయంలోని బ్రహ్మోత్సవ మండపంపై కల్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. మొదట ప్రధానాలయలో రాత్రి 8:25 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాడ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ వేడుకలను మండపంలో స్వామివారు పడమటి వైపు, అమ్మవారిని తూర్పు వైపు సేవలో అధిష్ఠింపజేసి వేడుకలు నిర్వహించారు.
విశ్వక్సేనుడి తొలి పూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో నారసింహుడు మహాలక్ష్మి అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కల్యాణమూర్తులను ఉత్తర దిశలో అధిష్ఠింపజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో విహరించారు.
నేడు దివ్య విమాన రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చి.. గరుడ వాహన సేవలో విహరించనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.
సకల సదుపాయాలు.. భారీ ఏర్పాట్లు
పరలోకం నుంచి సకల దేవతలు వీక్షిస్తున్నట్టుగా ఇహలోకంలో యాదగిరి కొండను ముస్తాబు చేశారు. కొండ చుట్టూ విద్యుద్దీపాల ధగధగలు మెరిశాయి. నృసింహుడి క్షేత్రం స్వర్ణ శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు కూర్చునేందుకు 3 వేల కుర్చీలు, వీక్షించేందుకు 8 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఇబ్బందులు లేకుండా కొండ కింద పార్కింగ్ పాయింట్లు పెట్టారు. భక్తుల తాకిడి, శాంతిభద్రతల నేపథ్యంలో డీసీపీ రాజేశ్చంద్ర నేతృత్వంలో 300 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
స్వామి, అమ్మవార్ల కల్యాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ తమ కుటుంబం తరఫున పట్టు వస్ర్తాలు, పండ్లు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారు లక్ష్మీదేవిని పరిణయమాడిన ఘట్టాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో యాదాద్రి కొండ కిక్కిరిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.