హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు జాతీయ గుర్తింపు లభించింది. ఈ రెండు ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ‘ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సర్టిఫికెట్ ఇచ్చింది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ‘బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్’ (భోగ్) సర్టిఫికెట్ పొందిన దేవాలయాలుగా రికార్డు సృష్టించాయి.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వంటి కొన్ని ప్రముఖ దేవాలయాలకు మాత్రమే భోగ్ గుర్తింపు ఉన్నది. ఇప్పుడు ఈ జాబితాలో తెలంగాణకు చెందిన రెండు దేవాలయాలు చేరడం విశేషం. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 70కిపైగా దేవాలయాలు ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం యాదాద్రి, వర్గల్ దేవాయాలను సందర్శించింది. నైవేద్యం, అన్న ప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, పాటిస్తున్న శుచి, శుభ్రతను పరిశీలించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకొని సర్టిఫికెట్ జారీ చేసింది.
‘భోగ్ గుర్తింపు లభించడం సంతోషించదగ్గ విషయం. ఇందుకు కృషిచేసిన ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు శుభాకాంక్షలు. అన్ని దేవాలయాలకు ఈ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి’ అని హరీశ్రావు పేర్కొన్నారు..
‘భోగ్’ సర్టిఫికెట్ సాధించేందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా కృషి చేసింది. ప్రత్యేక నోడల్ అధికారిణిగా అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి వ్యవహరించారు. ఆమె ఆధ్వర్యంలోని బృందం యాదాద్రి, వర్గల్ దేవాలయాల్లో నైవేద్యం, అన్న ప్రసాదాలు తయారీలో నాణ్యత ప్రమాణాల గురించి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బృందం జరిపిన ఫైనల్ ఆడిట్లో రెండు దేవస్థానాలకు జాతీయ గుర్తింపు దక్కింది.