హైదరాబాద్ : రుణాల ఎగవేత కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా కోరుతూ గోల్డెన్ జూబ్లీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన అర్జున్సింగ్ ఒబెరాయ్, లక్ష్మీనారాయణశర్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు నేహా గంభీర్, యశ్దీప్ శర్మలను సీబీఐ నిందితులుగా చేర్చింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్ (యుబీఐ) పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (కెనరా), జమ్ము కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు రూ.1285 కోట్లను ఎగవేతకు పాల్పడినట్లుగా సీబీఐకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేసింది.హైదరాబాద్ శిల్పారామం సమీపంలోని 4.5 ఎకరాలను స్టేట్ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్టుమెంట్ 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఖరీదైన భూమిని లీజుకు ఇచ్చింది.
అయితే ప్రమోటర్లు భూమితోపాటు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నప్పటికీ నిధులను మళ్లించడంతో ప్రాజెక్టు దివాళాకు దారితీసింది. దీంతో గోల్డెన్ జూబ్లీ హోటల్స్ కంపెనీకి చెందిన ట్రైడెంట్ ఫైవ్ స్టార్ హోటల్కు చెందిన అర్జున్ సింగ్ ఒబెరాయ్, ఎల్.ఎన్. శర్మలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన్న రిట్లను సోమవారం హైకోర్టు విచారించనుంది.