న్యూఢిల్లీ: దేశీయ కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఇప్పటివరకు కారును నడిపే డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్బ్యాగ్ ఉండేది. కానీ ప్రయాణికుల భద్రత మరింత బలోపేతం చేయడానికి డ్రైవర్తోపాటు ముందు ప్రయాణించే మరో ప్రయాణికుడి సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్లోనే కార్లలో ముందు రెండు సీట్లకు తప్పనిసరి చేయాలా? వద్దా? అన్న విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అయితే, ఇప్పుడిప్పుడే డిమాండ్ పుంజుకుంటున్న నేపథ్యంలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగ్లు అమర్చడం వల్ల కార్ల తయారీ దారులపై భారం పెరుగుతుందని భావిస్తున్నారు.
కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగులు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు అన్ని కార్లలో డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్బ్యాగ్ ఉండేది.
అయితే, ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు గాయాల నుంచి, ప్రాణ హాని ముప్పు నుంచి ఎయిర్బ్యాగ్లు రక్షించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, సీట్ బెల్ట్ రిమైండర్లు అన్ని కార్లలో స్టాండర్డ్ ఫీచర్లుగా ఉన్నాయి. కానీ లైఫ్ సేవింగ్ ఎయిర్బ్యాగ్లు మాత్రం ఇప్పటివరకు తప్పనిసరి చేయలేదు.
ఇక నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్తగా ఉత్పత్తి చేసే అన్ని రకాల మోడళ్ల కార్లలో ముందు రెండు సీట్లకు ఎయిర్బ్యాగ్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను అమలు చేయాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఉత్పత్తి చేసిన కార్లలో మాత్రం జూన్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నదని రవాణాశాఖ మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన ముసాయిదా ఇంతకుముందు నివేదిక పేర్కొన్నది.
రెండేండ్ల క్రితం కార్ల డ్రైవర్ సీటుకు ఎయిర్బ్యాగ్ అమర్చడం తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ నిర్ణయం 2019 జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది.