‘ఇంటింటా ఇన్నోవేటర్’.. డెలివరీ రోబో ఆవిష్కరణ
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ‘ధీరా’ పేరుతో రూపొందించిన డెలివరీ రోబోను ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హెచ్ బోట్స్ స్టార్టప్ ఫౌండర్, ఆలిండియా రోబోటిక్ అసోసియేషన్ ప్రతినిధి కిషన్ను అభినందించారు. తెలంగాణ వ్యాప్తంగా 60 ప్రభుత్వ పాఠశాలల్లో రోబోటిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పలు అంశాలపై విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యను అందించడంలో తోడ్పడనున్నట్లు అమి రోబోటిక్స్ నిర్వాహకురాలు రమ్య తెలిపారు.
స్మార్ట్ మ్యాట్ యోగా ట్రైనర్ సందర్శకులందరినీ ఆకర్షించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో దీనిని రూపొందించిన ఈ స్టార్టప్ పేరు ‘యోగీఫీ’. స్టార్టప్లను సందర్శించుకుంటూ వచ్చిన మంత్రి కేటీర్.. ఇక్కడికి రాగానే ‘యూపీ సీఎం యోగీ పేరుతో రూపొందించారా?’ అనగానే అక్కడ నవ్వులు విరిశాయి. యోగాసనా లు తెలియని వారికోసం ఈ స్టార్టప్ ఓ మంచి మెంటర్గా గైడ్ చేయ డానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
యోగా ట్రైనర్ ప్రత్యేకతలు..
జనరేషన్-2తో రూపొందించిన ఈ యాప్ యోగా, బాడీ వెయిట్, ఎక్సెర్సైజ్, ఫిట్నెస్ ట్రైనింగ్ సూచనలు చేస్తుందని ఫౌండర్ నిర్వాహకుడు మురళీధర్ అన్నారు. దీనిని లెర్న్, ప్రాక్టీస్ విధానంలో పేటెంటెడ్ టెక్నాలజీతో 2018లో రూపొందించారు. ఈ యాప్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది.
మీ ఇంట్లో పొడి చెత్త ఉన్నదా..అయితే దీనికి డబ్బులు ఇచ్చి తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాయి స్టార్టప్ సంస్థలు. హైదరాబాద్లో ఇలాంటి సేవలు ఆరంభించింది బిన్టిక్స్ స్టార్టప్ సంస్థ. భాగ్యనగరంతోపాటు బెంగళూరు, చెన్నైలతో పాటు మరో 4 నగరాల్లో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించి కొనసాగిస్తుంది. సంస్థ ప్రత్యేకంగా ఇచ్చిన సంచిలో వేస్తున్న పొడి చెత్తను తూకం చేసి సేకరిస్తుంది. కిలో పొడి చెత్తకు రూ. 4 నుంచి 10 వరకు ఇస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి శ్రవణ్ తెలిపారు. ఇలా సేకరించిన చెత్తను పలు రీసైక్లింగ్ కేంద్రాలకు విక్రయిస్తుంది. 2018లో ప్రారంభమైన ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్లో 500 ఇండ్లతో ప్రారంభమై ప్రస్తుతం 20 వేల ఇండ్ల నుంచి చెత్తను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తడి చెత్తను కమ్యూనిటీల్లోనే ప్రత్యేకంగా కంపోస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మానవ శరీరంలోని రక్తాన్ని తీయకుండా 60 సెకన్ల వ్యవధిలో రక్తంలోని ముఖ్యమైన 6 వైటల్స్ వివరాలను అందిస్తుంది ఈ స్టార్టప్. బ్లూ సెమీ రూపొందించిన వరల్డ్ ఫస్ట్ హెల్త్ గాడ్జెట్ ద్వారా రక్తంలోని ఆక్సిజన్, గ్లూకోజ్, హెచ్బీఏ1సీలతో పాటు ఈసీజీ, గుండె వేగం కొట్టుకోవడం వంటి వివరాలను అందిస్తుంది. మొబైల్ ఫోన్లోని యాప్కు గాడ్జెట్ను అనుసంధానం చేసి, రెండు చేతుల బ్రొటన వేళ్లను టచ్ చేసి కదపకుండా 60 సెకన్ల పాటు ఉంచితే, 6 వైటల్స్ వివరాలు వెంటనే వస్తాయని కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ మాన్సి తెలిపారు.
ఇంధనం దొంగతనాలకు పాల్పడే వారికి చెక్ పెట్టే పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్టార్టప్ సిర్రప్ సంస్థ రూపొందించిన ‘డీజిల్ ఐ’ యాప్ను తీర్చిదిద్దింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల సహాయంతో పార్కింగ్ చేసిన వాహనాల ఫ్యూయల్ ట్యాంక్లోని ఇంధన పరిమాణం తగ్గడాన్ని వెంటనే పసిగట్టి పరికరానికి యాప్ ద్వారా అనుసందానం చేసిన మొబైల్ ఫోన్కు వెంటనే సమాచారాన్ని చేరవేస్తుందని కంపెనీ సీఈవో గౌరవ్ తెలిపారు. వెంటనే అలర్టయిన వాహన యజమాని దొంగను పట్టుకునే వీలుంటుంది.
మెటావర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్’
మెటావర్స్ ఇన్నోవేషన్ 3డీ మోడల్లో విద్యా విధానం, పరిశ్రమల రంగా ల్లోని భారీ యంత్రాల పని విధా నం, అవగాహన కోసం డీప్లూప్ టెక్నాలజీస్ పనిచేస్తున్నది. 3డీ విధానంలో పలు మోడల్స్ రూపొందిస్తున్నది. విద్యార్థుల కోసం మోడల్స్ను విస్తరిస్తున్నదని డీప్లూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూచిమంచి సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. వర్చువల్ మోడ్లో అధ్యయనానికి ఈ విధానం ఎంతో తోడ్పాటును అందజేస్తున్న దని చెప్పారు. వర్చువల్ ల్యాబ్స్, వర్చువల్ సెమినార్స్ నిర్వహించి అంశాలవారిగా ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ఎలక్ట్రిక్ ఆటోల బ్యాటరీ రీచార్జ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ‘రీఎనర్జీ’ పాయింట్ ద్వారా తక్షణమే బ్యాటరీలను మార్చుకోవచ్చు. నగరంలో ఏర్పాటు చేసిన రీఎనర్జీ పాయింట్ల వద్ద ఆటోలోని చార్జ్ తగ్గిన బ్యాటరీలను రీప్లెస్ చేస్తారు. బ్యాటరీల ఛార్జ్ కోసం పాయింట్ల వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా తక్షణమే రీప్లెస్ చేసుకుని వెళ్ళవచ్చు. దీని ద్వారా సమయంతో పాటు బ్యాటరీలు ఎప్పటికి పాడవ్వకుండా ఉండడంతో ఖర్చు ఆదా అవుతుంది. దీంతో పాటు అన్ని రకాల(డీజల్, పెట్రోల్, సీఎన్జీ) బజాజ్ ఆటో రిక్షాలను రీఎనర్జీ సంస్థ అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలుగా మారుస్తుంది. ఈ బ్యాటరీల ద్వారా 90 నుంచి 100కిలో మీటర్లు ప్రయాణించవచ్చు. ఇప్పటికే నగరంలో 15 పాయింట్లు ఉండగా, భవిష్యత్తులో వీటి సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రీఎనర్జీ ప్రతినిధి అరుణ్ తెలిపారు. భారత్, హెచ్పీ పెట్రోల్ పంపులలో రీఎనర్జీ పాయింట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.