ఊసరవెల్లిలా కరోనా రూపాలు
వ్యాధి లక్షణాల్లోనూ మార్పులు
యువతపై కక్ష.. చిన్నారులపైనా ప్రతాపం
పెద్ద వయసువారిపై తీవ్రంగా దాడి
అప్రమత్తమయ్యేలోపే చావుదెబ్బ
దాని వేషాలకు లెక్కలేదు. దాని వ్యాప్తికి అడ్డులేదు. దానికి తెలిసిందొక్కటే.. చావుదెబ్బ కొట్టడం. కట్టెకు పట్టే చెదపురుగుల లెక్క, మనిషి శరీరాన్ని గుల్ల చేస్తున్నదీ కరోనా. ఊసరవెల్లిలా రంగులు, రూపాలు మార్చుతూ, దొరికినవాళ్లను దొరికినట్టు ఆవహిస్తున్నది. మొదటి దశ షాంపిల్ మాత్రమే, రెండో దశలో నేనేంటో చూపిస్తానని వేలాదిమంది ప్రాణాలను హరిస్తున్నది. మరిన్ని వ్యాధులను అంటించి వణుకు పుట్టిస్తున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే అది కరోనానే కావొచ్చనే అనుమానం మొదలవుతుంది. కానిప్పుడు తలనొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం ఇలా ఏ ఒక్క లక్షణం మీలో ఉన్నా అది కరోనా కావొచ్చనే అనుమానపడాలని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మొదటిదశలో కనిపించని అనేక లక్షణాలు రెండో వేవ్లో కనిపిస్తున్నాయి. గతంలో పదిమందిలో ఒకరిద్దరికి సోకిన కరోనా, ఇప్పుడు ఏడెనిమిది మందికి సోకుతున్నది. దాని తీవ్రత కూడా ఎక్కువైంది. దాంతో దవాఖానల్లో చేరేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సరైన చికిత్స అందించేలోపే పరిస్థితి విషమిస్తున్నది. ఆక్సిజన్, వెంటిలేటర్ పెట్టినా బతికించుకోలేని దుస్థితి ఎదురవుతున్నది. తొలిదశలో పిల్లల జోలికే వెళ్లని వైరస్.. ఇప్పుడు మాత్రం వదలటం లేదు. యువత కనిపించటమే తరువాయి.. కక్ష కట్టినట్టు దారుణంగా దాడి చేస్తున్నది. గతంలో మొదటి వేవ్ ప్రారంభమైన ఆరు నెలల కాలంలో సెప్టెంబర్ 18 నాటికి 30,673 యాక్టివ్ కేసులు ఉండగా, రెండో వేవ్ ప్రారంభమైన కేవలం రెండు నెలల కాలంలోనే ఆ సంఖ్య 46,488కి చేరుకున్నది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 21,50,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో 63 పైగా జిల్లాలు సెకండ్ వేవ్ కారణంగా అత్యధికంగా ప్రభావితమవుతున్నట్టు కేంద్రహోంశాఖ వెల్లడించింది.
మరిన్ని కీలకాంశాలు..
లక్షణాలు
మొదటి వేవ్ -పొడి దగ్గు, జ్వరం, వీక్నెస్, శ్వాస సమస్యలు
రెండో వేవ్ – మొదటి వేవ్ లక్షణాలకు అదనంగా, తలనొప్పి, విరేచనాలు, ఒంటి నొప్పులు, నీరసం, వాంతులు, వినికిడి సమస్యలు, నోటి పొక్కులు, నాలుక పగలటం, కళ్లు ఎర్రబడటం
పాజిటివిటీ రేటు పైపైకి!
మే రెండోవారం వరకు పెరిగే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటు పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతున్నది. ఈ పెరుగుదల మే రెండోవారం వరకు కొనసాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. మార్చిలో వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నా.. ఈ నెలలో వేగం పెరిగింది. ఇది మే నెల రెండో వారం వరకు కొనసాగవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఆ తర్వాత క్రమంగా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉన్నదని వారు పేర్కొంటున్నారు.
30 వరకు సన్నబియ్యం పంపిణీ
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి అందజేసే 25 కిలోల సన్నబియ్యాన్ని ఈ నెల 30 వరకు పంపిణీ చేయనున్నారు. బియ్యం పంపిణీ గడువు సోమవారంతో ముగిసినా.. ఇప్పటివరకు తీసుకోలేకపోయిన వారికోసం గడువును పొడిగించారు. లబ్ధిదారులు రేషన్షాపుకు వెళ్లి బియ్యం పొందవచ్చని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో మొదటి వేవ్, రెండో వేవ్లో నమోదైన కేసులు
జిల్లా సెప్టెంబర్ 18 ఏప్రిల్ 21
జీహెచ్ఎంసీ 314 898
నిజామాబాద్ 84 427
కామారెడ్డి 49 235
మహబూబ్నగర్ 24 263
కరీంనగర్ 127 203
వరంగల్ అర్బన్ 98 244