ఖమ్మం, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదేండ్ల బీజేపీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని, పాలనలో నియంతృత్వం వచ్చేసిందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ అగ్రనేత ప్రదీప్సింగ్ ఠాగూర్ అన్నారు. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) ఆర్ఐ పార్టీలన్నీ కలిసి సీపీఐ (ఎంఎల్) మాస్లైన్గా ఏర్పడిన సందర్భంగా ఆదివారం ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవ పార్టీలు చేసిన తప్పిదాలను ఇప్పటికే గుర్తించాయని, ఆ తప్పిదాలను సరిచేసుకునేందుకే ఒక్కటైనట్టు చెప్పారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై మున్ముందు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. వామపక్ష పార్టీల్లో చీలికల కారణంగా ఉద్యమాలు బలహీనమైనట్టు తెలిపారు. నేడు వామపక్షవాదులంతా ఒక్కటై ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై గొంతెత్తిన వారిపై రాజ్యాంగ వ్యవస్థలను ప్రయోగించడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు సుభాల్ దేవ్, సంజయ్ సింఘ్వీ, ధినిష్ గోహైన్, కేజీ రాంచందర్, కే రమ, ఆర్ చంద్రశేఖర్, గుమ్మడి నర్సయ్య, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పూజారి, జీవన్కుమార్, రవిబాబు, నెటార్, త్రివేది పాల్గొన్నారు.