హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోటీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఓ ప్రధానోపాధ్యాయురాలి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆ ప్రధానోపాధ్యాయురాలు తన సోదరుడి కోసం టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్కుమార్ ద్వారా క్వశ్చన్ పేపర్ను సంపాదించి, దానిని మరో ముగ్గురికి రూ.14 లక్షలకు విక్రయించిట్టు సమాచారం. ఈ వ్యవహారంపై డయల్ 100కు ఫిర్యాదులు రావడంతో ఈ విషయాన్ని పోలీసులు టీఎస్పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. అంతర్గతంగా ఆరా తీసిన టీఎస్పీఎస్సీ అధికారులు.. లీకేజీ జరిగినట్టు నిర్ధారించుకొని ఆ పరీక్షను రద్దు చేశారు. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసుల సహకారంతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రవీణ్కుమార్కు, హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలికి పరిచయం ఉన్నది. ఆమె సోదరుడు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తమకు టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్కుమార్ను కోరారు.. దీంతో ప్రవీణ్కుమార్ టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న అడ్మిన్ రాజశేఖర్తో కలిసి ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసి, ఆ ఉపాధ్యాయురాలికి అందజేశారు. దీంతో ఆమె వాటిని తన సోదరుడికి ఇవ్వడమే కాకుండా మరో ఇద్దరికి రూ.14 లక్షలకు విక్రయించారు. అందులో రూ.10 లక్షలు ప్రవీణ్కుమార్కు ముట్టజెప్పి, మిగిలిన రూ.4 లక్షలు తాను తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి ప్రశ్నపత్రం పొందిన ఆ యువకులు ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఇతరులతో చర్చించారు. అందులో ఒక యువకుడు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రవీణ్కుమార్తోపాటు మరికొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.