హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పోలీస్ నియామక సంస్థ పొడిగించింది. ఇవాళ రాత్రి 10 గంటలతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇదిలా ఉండగా.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి.. అభ్యర్థులకు విజ్ఞప్తుల మేరకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల విన్నపాలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించి, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ను, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలుస్తున్నది. మరో వైపు పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి 2.05 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు పొడిగించడంతో దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.