హైదరాబాద్ : ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలనే సంకల్పంతో నెలకొల్పిన అందరికి ఆయుర్వేదం సంస్థ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో ఏల్చూరి ఆయుర్వేద ప్రయివైట్ లిమిటెడ్ సంస్థ లోగోను రమణాచారి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేద వారసత్వాన్ని ఆయన తనయుడు డాక్టర్ రాజా రంజిత్ కొనసాగించడం, ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రపంచమంతటా చాటిచెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగడం ఎంతో సంతోషంగా వుందని పేర్కొన్నారు. ఈ సంస్థ మూడు పువ్వులు ,ఆరు కాయలుగా వెలిగిపోవాలని ఆకాంక్షించారు. ఈ సంస్థ గొప్ప ఆశయంతో ముందుకుపోవడం ఆనందంగా ఉందని రమణాచారి తెలిపారు.
ఆయుర్వేద గొప్పతనం ప్రపంచమంతటా తెలియజేయడం కోసం ఈ సంస్థ నడుం బిగించడం గొప్ప విషయమని సినీ నటుడు నారా రోహిత్, శ్రీవిష్ణు తెలిపారు.
సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ రాజా రంజిత్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి అనే నాన్న మాటల స్ఫూర్తితో ఆయన బాటలో నడుస్తున్నామని తెలిపారు. ఆయుర్వేదాన్ని ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నానని చెప్పారు. తనకు తోడుగా వినయ్ ప్రోత్సాహంతో ఇండియాలో ఏల్చూరి స్టోర్స్తో పాటు, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బద్రినాథ్, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వినయ్, రూపేష్ ఫణి సాయిరాం, సురేందర్, మూర్తి, కూర విశ్వనాథ్, డా.జ్ఞానేశ్వరి, డా.వైదేహి తదితరులు పాల్గొన్నారు.