కరోనా మహమ్మారి పేరు వినగానే శరీరంలో వణుకు పుడుతోంది. కంటి నిండా నిద్ర పోదామంటే కూడా పోలేని పరిస్థితి. అతి భయంకరమైన పరిస్థితుల్లో అటు వైద్య సిబ్బంది, ఇటు ప్రజలు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. వైద్యులు అయితే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు డాక్టర్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది డాక్టర్లను సైతం కరోనా బలి తీసుకుంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ గైనకాలజిస్టు తన వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదు. నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసీ కూడా ఆమెకు ఓ గైనకాలజిస్టు పురుడు పోసింది. ఆ గైనకాలజిస్టు ఎవరో కాదు.. నిర్మల్ జిల్లాలోని భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ వనిత. నెలలు నిండిన గర్భిణికి కరోనా సోకినప్పటికీ.. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ వనిత ఏ మాత్రం భయపడకుండా గర్భిణికీ కాన్పు చేసి ప్రశంసలు అందుకుంటోంది.
డాక్టర్ వనిత సేవలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసల వర్షం కురిపించారు. విపత్కర పరిస్థితుల్లోనూ.. అది కూడా కరోనా సోకిన గర్భిణికి కాన్పు చేసి డాక్టర్ వనిత అందరికీ ఆదర్శంగా నిలిచారని కవిత ట్వీట్ చేశారు. డాక్టర్ వనిత నవజాత శిశువును ఎత్తుకుని ఉన్న ఫోటోను కవిత తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.
In the middle of such disturbing times, Dr. Vanitha has been such an inspiration. A Gynaecologist of Government Hospital, Bhainsa Nirmal has been fearlessly and successfully determined to help #COVID19 positive pregnant women. pic.twitter.com/HoxiVX8rrF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 22, 2021