హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఆరేండ్ల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నట్టు బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రకటించింది. 2021-22లో పాలీసెట్ ద్వారా సీట్లను భర్తీచేయగా.. 2022-23 విద్యాసంవత్సరంలో టెన్త్ మార్కుల ఆధారంగానే సీట్లు భర్తీ చేస్తామని వెల్లడించింది. వర్సిటీ ఆవిర్భావం నుంచి ఎస్సెస్సీ గ్రేడ్ పాయింట్ యావరేజీ (జీపీఏ), రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు నింపుతున్నారు. 2021లో ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేశారు. 2,10,647 మందికి 10 జీపీఏ వచ్చింది. 1,000 సీట్లే ఉండటం, 2 లక్షల మందికి 10 జీపీఏ రావడంతో పాలీసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించారు. వచ్చే విద్యాసంవత్సరం పాలీసెట్ ద్వారా ప్రవేశాలకు ప్రయత్నించినా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పాతపద్ధతినే అనుసరించనున్నట్టు ఆర్జీయూకేటీ వర్గాలు వెల్లడించాయి. సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ఆర్జీయూకేటీ బాసర ఏవో రాజేశ్వర్రావు వెల్లడించారు.