దామరచర్ల, జూలై 7 : లంచం తీసుకొంటూ ట్రాన్స్కో అసిస్టెంట్ లైన్మన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ ఇంచార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన రైతు కర్నం మోహన్రెడ్డి తన వ్యవసాయ భూమిలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం గత ఏడాది అక్టోబర్ 21న మూడు డీడీలు కట్టి విద్యుత్తు కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇవ్వాలని ఈ ఏడాది మే నెలలో పైఅధికారి అసిస్టెంట్ లైన్మన్ బంటు సైదులును ఆదేశించారు. అయితే సైదులు రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బు ఇస్తేనే కనెక్షన్ ఇస్తానని పలుమార్లు తిప్పించుకొన్నాడు. విసిగిపోయిన రైతు రూ.2,500 ఇచ్చేందుకు అంగీకరించారు. ఆపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒప్పందంలో భాగంగా రైతు మోహన్రెడ్డి గురువారం సైదులుకు రూ.2,500 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. సైదులును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.