హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ఆదివారం సాయంత్రానికి 1.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు 213 టీఎంసీలకు చేరుకున్నది. తుంగభద్ర డ్యామ్ గేట్లను మొత్తం దిగువను వరదను వదులున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సైతం గేట్లను ఎత్తి వరదను దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రాలు, మూడు క్రస్ట్గేట్లు (10 అడుగుల మేరకు) ఎత్తడంతో 1,39,634 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగర్కు వస్తున్నది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 (312 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 571.80 (261.0886 టీఎంసీ) అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ సీజన్లో ప్రాజెక్టు నీటిమట్టం 523 అడుగుల నుంచి 571 అడుగులకు పెరిగింది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు ఆరు గేట్లతో ఆదివారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 9,865.16 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
గోదావరి బేసిన్లో స్థిరంగా వరద..
గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.96 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. నిజాంసాగర్, రాజరాజేశ్వర జలాయశం, ఎల్ఎండీ, కడెం ప్రాజెక్టులతోపాటు పార్వతి, సరస్వతి, లక్ష్మి, సమ్మక్క బరాజ్ల వద్ద కూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు మరో మూడురోజులపాటు వరద కొనసాగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.