హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 94,656కు చేరింది. ఇటీవలే 80,091 సీట్లకు అనుమతి ఇవ్వగా, తాజాగా మరో 14,565 సీట్లకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి. ఈ ఏడాది అన్ని కోర్సులు కలిపి కొత్తగా 7,635 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో -114ను జారీచేశారు. అయితే, కోర్ గ్రూప్ల్లోని సీట్లను మూసివేయడం, కోర్సులను విలీనం చేసి, సీఎస్ఈ సీట్లు మార్చడంతో కొత్తవాటితో కలిపి ప్రస్తుతం సీట్లు 14,565కు చేరాయి. వీటిలో 10,196 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ఒక్క కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లోనే 6,390 సీట్లు కొత్తగా లభించనున్నాయి. కొత్తగా మంజూరుచేసిన 7,635 సీట్లతో ప్రభుత్వంపై అదనంగా రూ. 27.39కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో భారం పడనున్నది. ప్రస్తుత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో కొత్తగా మంజూరుచేసిన సీట్లను కూడా కేటాయిస్తారు.
సీట్లకు అనుమతులిలా..
సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈఈఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్ కోర్సుల్లో గతేడాది 60 చొప్పున సీట్లుండగా, తాజాగా ఒక్కో బ్రాంచిలో 30 సీట్లకే తగ్గించారు. ఈ కాలేజీలో సీఎస్ఈ ఏఐఎంఎల్ సీట్లు 120 సీట్లుంటే 180, సీఎస్ఈ డాటాసైన్స్ సీట్లను 120 నుంచి 180కి పెంచారు.
గురునానక్ కాలేజీలో సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను 120 నుంచి 60కి తగ్గించగా, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచిల్లో సీట్లను 60 నుంచి 120కి పెంచారు.
స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ ఏఐఎంల్ కొత్త కోర్సును 120 సీట్లకు అనుమతించారు.
ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లకు కోత..
ఇదివరకు కోర్ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొనేందుకు కాలేజీలు సిద్ధపడగా ఈ ఏడాది పరిస్థితి మారింది. కోర్ కోర్సులే కాకుండా ఎమర్జింగ్ కోర్సుల్లోనూ కాలేజీలు సీట్లను తగ్గించుకున్నాయి. సీఎస్ఈలో స్పెషలైజేషన్లుగా ఉన్న సీఎస్ఈ ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకొని కేవలం సీఎస్ఈ కోర్సువైపు మెగ్గుచూపాయి.
కోర్ బ్రాంచి 30 సీట్లకే..
ఈ ఏడాది సివిల్, మెకానికల్, సీఈఈ, ఈఈఈ వంటి కోర్ గ్రూప్ల్లో 6,390 సీట్లు రద్దయ్యాయి. ఈ సీట్లు మొత్తం సీఎస్ఈ సీట్లుగా మార్చుకొనేందుకు కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం అనుమతించింది. గతంలో ఈసీఈ బ్రాంచిలో 360 సీట్లున్న కాలేజీలో 300 సీట్లు రద్దుకాగా, ఈ సీట్లను సీఎస్ఈ బ్రాంచికి బదలాయించారు. పలు కాలేజీల్లో ఇలాంటివే జరిగాయి. కోర్ గ్రూపులను పూర్తిగా క్లోజ్ చేయరాదని, ఒక్కో బ్రాంచిని 50శాతం సీట్లతో నిర్వహించాలని ఏఐసీటీఈ నిబంధనలు చెబుతున్నాయి. వీటి ప్రకారం ఒక్కో బ్రాంచిలో 60 సీట్లుంటే.. 30 సీట్లకే కోర్ గ్రూపులు పరిమితమవుతున్నాయి.
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి ఇవ్వడం, ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకానుండటంతో ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేశారు. వివరాలకు https:tseamcet.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని వాకాటి కరుణ సూచించారు.