హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులు రాష్ట్రంలో చదువడంలేదు. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగం టాపర్లు మన రాష్ట్రంలో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. అత్యధికులు వలసపోతున్నారు. మన రాష్ట్రం వదిలి ఇతర రాష్ర్టాలకు చలో అంటున్నారు. ఎప్సెట్ టాప్-100 ర్యాంకర్లల్లో కేవలం ఐదుగురు మాత్రమే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకున్నారు.
అంటే 95 మంది ఇంతవరకు ఎప్సెట్ కౌన్సెలింగ్ వైపే చూడలేదు. 100 నుంచి 500లోపు ర్యాంకర్లలో కేవలం 42 మంది మాత్రమే కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకొన్నారు. ఎప్సెట్ మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. ప్రస్తుతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నడుస్తున్నది. ఈసారి 84,002 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో బుధవారం వరకు 36,393 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు.
రాష్ర్టానికి చెందిన టాపర్లలో అత్యధికులు అయితే ఐఐటీ.. లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీ అంటున్నారు. సీటు వస్తే ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరుతున్నారు. ఫీజులు కట్టే స్థోమత గలవారు ప్రైవేట్ వర్సిటీల బాటపడుతున్నారు. రాష్ట్రంలో టాప్ 20 కాలేజీలు మినహా చాలా కాలేజీల్లో నాసిరకం విద్యాప్రమాణాలున్నాయి. ఫ్యాకల్టీ కొరత.. వసతుల లేమి వంటి వాటి నేపథ్యంలో ప్రైవేట్ వర్సిటీల బాటపడుతున్నట్టు అంచనాలేస్తున్నారు. టాపర్లు ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు పొందే చాన్స్ ఉంది. ఐదువేల తర్వాతి ర్యాంకర్లే రాష్ట్రంలో అడ్మిషన్లు పొందుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సారి ఐదువేల లోపు ర్యాంకర్లలో మూడు వేల మంది మాత్రమే ఎప్సెట్ కౌన్సెలింగ్కు హాజరయ్యారు. పదివేల లోపు ఏడు వేల మంది వరకు ఎప్సెట్ బాటపట్టారు.
